ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఇంజినీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను తెలంగాణ గృహనిర్మాణ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టులను గతంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలోని ఇంజినీరింగ్ విభాగాలకు ప్రభుత్వం ఇచ్చింది. తాజాగా వాటిని తిరిగి గృహనిర్మాణ శాఖకు బదిలీ చేయాలంటూ జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్కు సూచించింది. వీటిని గృహనిర్మాణసంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, సూపరింటెండెంట్ ఇంజినీరుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలంది. ప్రాజెక్టు డైరెక్టర్, సూపరింటెండెంట్ ఇంజినీరు ఈ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా నిబంధనలకు లోబడి పూర్తిచేయడంతో పాటు లబ్ధిదారులకు అప్పగించాలని సూచించింది.