లైవ్ ఫీడ్
కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
- వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థులను సీనియర్లు మోకాళ్లపై కూర్చోబెట్టారు. దీనిపై బాధితులు కాలేజీలోని ర్యాంగింగ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. పరిశీలించి విచరాణ జరిపిన కాలేజీ ప్రతినిధులు బాధ్యులైన ఏడుగురు సీనియర్లను సస్పెండ్ చేశారు. వీరిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
భూసర్వేకు వెళ్లిన జీపీవోపై గిరిజనుల దాడి
- మెదక్ జిల్లాలో భూసర్వేకు వెళ్లిన జీపీవో భూపాల్పై గిరిజనులు దాడి చేశారు. కౌడిపల్లి మండలం కుశన్గడ్డ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సర్వేకు వెళ్లిన సమయంలో గిరిజనులు కారం చల్లి దాడి చేశారు. దాడిలో తీవ్రగాయాల పాలైన భూపాల్ కౌడిపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జగిత్యాలలో జీవన్రెడ్డితో సమావేశమైన కేటీఆర్
- ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన సీనియర్ నేత జీవన్రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. జీవన్రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జగిత్యాలలో ఈ సమావేశం జరిగింది.
అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీకి పట్టుబడిన ఆర్ఐ శ్రీమాన్
- పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ శ్రీమాన్ ఏసీబీకి(ACB attack) పట్టుబడ్డారు. రాయదండికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి భూమి సర్వే కోసం లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఇవాళ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
పవన్ ఖేరా తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు
తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ పవన్ ఖేరా(Pavan Khera Bail) ముందస్తు బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం రేపు తీర్పు వెల్లడించింది. పవన్ ఖేరా తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. గౌహతి క్రైమ్ బ్రాంచ్ పీఎస్లో నమోదైన కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఖేరా ఈ పిటిషన్ వేశారు. అస్సాం సీఎం సతీమణికి మూడు పాస్పోర్ట్లు ఉన్నాయని పవన్ కేరా ఆరోపించారు. దీనిపై ఆమె ఫిర్యాదు మేరకు గౌహతి క్రైమ్ బ్రాంచ్ పీఎస్లో కేసు నమోదైంది. దీంతో ఆ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పవన్ కేరా హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష్యతో కేసు నమోదు చేశారని అభిషేక్ సింఘ్వీ వాదించారు. పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.
వెంగళరావునగర్లో కొనసాగుతున్న ఆర్టిజన్ల సమ్మె
- హైదరాబాద్ వెంగళరావునగర్లో ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతోంది. ఒకటే సంస్థ ఒకటే రూల్ నినాదంలో ఆర్టిజన్లు సమ్మె చేస్తున్నారు. స్టాండింగ్ రూల్స్ రద్దు చేసి ఏపీఎస్ఈబీ రూల్స్ అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్పై విద్యుత్ సంస్థలు సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా మరోసారి తెలుగు అధికారి
- ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా మరోసారి తెలుగు అధికారి ఎంపికయ్యారు. ఆదాయపన్ను ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా సురేష్ బత్తిని బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్ కమిషనర్ మోరంపూడి అనిల్ కుమార్ స్థానంలో ఈ నియామకం జరిగింది.
సీఎం రేవంత్రెడ్డిపై జీవన్రెడ్డి విమర్శలు చేయడం సరికాదు: మహేశ్కుమార్ గౌడ్
- సీఎం రేవంత్రెడ్డిపై జీవన్రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు(TPCC CHIEF) మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, భవిష్యత్తులో 2 పార్టీలు కలిసి పోతాయని జోస్యం చెప్పారు. మంత్రులపై విమర్శలు చేసేవాళ్ల ఆధారాలు తీసుకురావాలని, పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని ప్రకటించారు. హరీశ్రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలన్నారు. ఈ మేరకు గాంధీభవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
సైబర్ మోసంపై జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్రెడ్డి
- పల్లా రాజేశ్వర్రెడ్డి సైబర్ మోసంపై జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. యువకులకు రూ.10 లక్షల చొప్పున రుణాలు ఇప్పిస్తామని చెప్పిన కేటుగాళ్లు, దరఖాస్తు ఫీజు కింద రూ.లక్ష పంపించాలని కోరారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన పల్లా, రూ.లక్ష ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం ఫోన్ ఎత్తకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖమ్మం జిల్లా: ముదిగొండలో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పరిశీలించిన డిప్యూటీ సీఎం
- ఖమ్మం జిల్లా ముదిగొండలో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో మండుతున్న ఎండలు – ఇవాళ ఆ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే భానుడి భగభగలు(Summer Heat) మొదలవుతున్నాయి. రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసిన కేటీఆర్
- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిశారు. జీవన్ రెడ్డి చేరిక, పార్టీ ఆవిర్భావ సభ, ఇతర అంశాలపై ఆయనతో చర్చించారు. కేసీఆర్తో చర్చించిన అనంతరం కేటీఆర్ అక్కడి నుంచి జగిత్యాల వెళ్లారు.
నాగర్కర్నూలు జిల్లాలో అటవీశాఖ, పోలీసులను అడ్డుకున్న స్థానికులు
నాగర్కర్నూల్ జిల్లాలో అటవీ శాఖ, పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. వెల్దండ మండలం అజీలాపురంలో డీఎల్ఐ జలాశయం నిర్మాణం చేపట్టేందుకు చెట్ల లెక్కింపునకు అధికారులు రాగా, స్థానికులు అడ్డుకున్నారు.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,800
హైదరాబాద్లో బంగారం ధరలు నేడు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.155800, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850, కిలో వెండి ధర రూ.246000గా ఉంది.
కాచిగూడ పరిధిలో పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్లు జైలు శిక్ష
కాచిగూడ పరిధిలో పోక్సో కేసులో నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. 2023 పోక్సో కేసులో నిందితుడు శైలేష్ పండులాల్ జైన్ అరెస్టయ్యాడు. రూ.లక్ష జరిమానాను బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆలె నరేంద్ర వర్ధంతి కార్యక్రమం
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆలె నరేంద్ర వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆలె నరేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి రాంచందర్రావు నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు ఆలె నరేంద్ర అని, ప్రత్యేక తెలంగాణ కోసం పార్టీ పెట్టి ఉద్యమం చేసిన వ్యక్తి ఆలె నరేంద్ర అని రాంచందర్రావు గుర్తు చేసుకున్నారు.
నల్గొండ: తిప్పర్తి వద్ద నిలిచిన పల్నాడు-సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు
నల్గొండ జిల్లా తిప్పర్తి వద్ద పల్నాడు-సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. తిప్పలమ్మగూడెం వద్ద రైలు గేదెను ఢీకొట్టగా, గేదె రెండు చక్రాల మధ్యన ఇరుక్కుపోయింది. దాంతో ఎక్స్ప్రెస్ నిలిచిపోగా నల్గొండ-మిర్యాలగూడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
జగిత్యాల పర్యటనకు బయలుదేరిన కేటీఆర్
జగిత్యాల పర్యటనకు కేటీఆర్ బయలుదేరారు. మాజీ మంత్రి జీవన్రెడ్డిని జగిత్యాలలో కలవనున్న కేటీఆర్, ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిలిచిన మిర్చి కొనుగోళ్లు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిచాయి. మార్కెట్ యార్డు ప్రధాన కార్యాలయం వద్ద రైతులు నిరసనకు దిగారు. అన్నదాతల ఆందోళనతో మార్కెట్ యార్డు వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డినగర్లో అగ్నిప్రమాదం
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డినగర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాల్వెంట్స్ డ్రమ్స్ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదంతో స్థానికులు భయాందోళ చెందుతున్నారు.
ఐపీఎల్లో నేడు కోల్కతా, లఖ్నవూ మధ్య మ్యాచ్
ఐపీఎల్లో నేడు కోల్కతా, లఖ్నవూ మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్కతాలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు బుధవారం ఢీల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
నేడు జగిత్యాలలో జీవన్రెడ్డితో సమావేశకానున్న కేటీఆర్
- నేడు జగిత్యాలలో జీవన్రెడ్డితో కేటీఆర్ సమావేశకానున్నారు. పార్టీ నేతలతో కలిసి ఇవాళ జీవన్రెడ్డితో కేటీఆర్ భేటీ కానున్నారు. జీవన్రెడ్డిని బీఆర్ఎస్లో చేరాలని కేటీఆర్ ఆహ్వానించనున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తదితరులు ఉన్నారు. ఇప్పటికే జీవన్రెడ్డి కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్నారు.