తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన దూకుడు.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ పనిచేస్తుందా?Janasena shows strength in 336 wards in Telangana municipal elections. | వరంగల్ వార్తలు (Warangal News)


చివరిగా నవీకరించబడింది:

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన 336 వార్డుల్లో గాజు గ్లాసు గుర్తుతో పోటీ, పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు, పార్టీ బలోపేతంపై దృష్టి, పట్టణ ఓటర్లపై ప్రభావం ఆసక్తికరం.

+

తెలంగాణలో

తెలంగాణలో జనసేన వ్యూహం ఎలా ఉండబోతుంది

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా, ఈసారి జనసేన పార్టీ కూడా తన ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నం చేస్తోంది. పట్టణ ఓటర్లను ఆకర్షించే దిశగా ప్రతి పార్టీ వ్యూహాలు రచిస్తూ మున్సిపల్ పోరులో బరిలో దిగింది.

ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 336 వార్డుల్లో తమ అభ్యర్థులను నిలబెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాజు గ్లాసు గుర్తుపై తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ సహా పలు పట్టణ ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు ఆమోదించినట్లు సమాచారం. ఇప్పటికే పోటీదారులకు బీఫారాలు కూడా అందజేశారు.

ప్రజలు గత పాలనలపై విసుగుతో ఉన్నారని, ఈసారి మార్పు కోసం చూస్తున్నారని జనసేన రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ వ్యాఖ్యానించారు. జనసేన అభ్యర్థులను గెలిపిస్తే ఆయా వార్డుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకురావడానికి అధినేత పవన్ కళ్యాణ్‌తో చర్చిస్తామని చెప్పారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించి ప్రచారం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నారు. యువత, కొత్త ఓటర్లను లక్ష్యంగా చేసుకుని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా పట్టణ ప్రాంతాల్లో బలమైన ప్రచార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. మొదట పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ, ఆ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది.

ఈనెల 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ ప్రచార పర్యటన ఉంటుందని ముందుగా ప్రకటించగా, రాజకీయ మరియు పరిపాలనా వ్యస్తతల కారణంగా పర్యటన నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో జనసేన, బీజేపీ అభ్యర్థుల్లో కొంత నిరాశ నెలకొంది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావించిన నేతలు ఇప్పుడు తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలను జనసేన తెలంగాణలో ఒక రాజకీయ పరీక్షగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు ఎంత మేరకు విజయాన్ని సాధిస్తారో, పట్టణ ఓటర్లపై పార్టీ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.



Source link

Spread the love