సమాఖ్య పాలనపై కొత్త సంవాదం | భారతదేశంలో కొత్త ఫెడరల్ డిబేట్ తమిళనాడు తమిళనాడు జస్టిస్ కురియన్ జోసెఫ్ ప్యానెల్ కేంద్ర రాష్ట్ర సంబంధాలలో నిర్మాణాత్మక సంస్కరణలకు పిలుపునిచ్చింది


మన గణతంత్ర రాజ్యం ఇప్పుడు పలు క్లిష్ట పరిస్థితుల నెదుర్కొంటున్నది. పర్యావరణ సంక్షోభాలకు పరిష్కారాలు, సంప్రదాయ వృత్తి విద్యలకు కొత్త శక్తినివ్వడం, ప్రత్యామ్నాయ విద్య, సమర్థమైన ఆరోగ్య భద్రతా విధానాలు, స్మార్ట్‌ ఐటీ క్లాస్టర్స్‌, వ్యాపారాలలో కొత్త పద్ధతులు మొదలైన విషయాలలో సమస్త భారతీయుల ఉమ్మడి భవిష్యత్తుకు ఉపయుక్తమైన కొత్త భావాలు, నమూనాలు, ప్రయోగాలు దక్షిణ భారతావని నుంచే ప్రభవిస్తున్నాయి. అలాగే రాజకీయ వ్యవహారాల్లో అధునాతన చర్చలూ దక్షిణాది ప్రారంభమవుతున్నాయి.

భారతదేశ సమాఖ్య పాలనా పద్ధతిపై ప్రస్తుత పరిస్థితులలో చాలా అవసరమైన సంభాషణను తమిళనాడు ప్రారంభించింది. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి గురించి ఎవరూ మాట్లాడని రోజులలో ఆ భావనను ప్రతిపాదించారు, సమర్థించిన రాజమన్నార్ కమిటీ (1969–71) స్ఫూర్తితో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది కేంద్రం–రాష్ట్రాల సంబంధాలపై ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ అధ్యక్షతన నియమితమైన త్రిసభ్య కమిటీ కొద్ది రోజుల క్రితమే ఒక నివేదికను సమర్పించింది. భారతదేశ సమాఖ్య పాలనా పద్ధతిపై శ్రద్ధాసక్తులు ఉన్నవారందరూ ఆ నివేదికను చదివి, చర్చించాల్సిన అవసరం ఉంది. రాజమన్నార్‌ కమిటీ సూచనలను పునరుద్ఘాటించేందుకు లేదా వాటిని తాజాగా ప్రతిపాదించేందుకే ఈ నివేదిక పరిమితం చేయబడింది. భారత రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య పాలనా పద్ధతిని మెరుగుపరిచేందుకు పలు నిర్దిష్టమైన ప్రతిపాదనలను ప్రజల పరిశీలనకు నివేదించింది.

సరళంగా చెప్పాలంటే ఒక కొత్త సమాఖ్య ఒప్పందం లేదా భారత సమాఖ్య నిర్మాణాత్మక పునర్వ్యవస్థీకరణకు న్యాయమూర్తి కురియన్ కమిటీ నివేదిక విజ్ఞప్తి చేసింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై మన రాజ్యాంగం నిర్దేశాలు కేంద్రీకరణవైపే ఎక్కువగా మొగ్గాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకలా జరిగింది? దేశ విభజన అల్లకల్లోల పరిస్థితులలో కొత్త స్వతంత్ర దేశం ఎదుర్కొన్న అవస్థలు రాజ్యాంగ రచనకు పూనుకున్న మన నాయకులను అమితంగా కలవరపరిచాయి. తత్కారణంగానే కేంద్రానికి ఎక్కువ అధికారాలు కల్పించారు. నాటి అల్లకల్లోల పరిస్థితులు పూర్తిగా సమసిపోయినప్పటికీ అధికారాల కేంద్రీకరణ ఒక వారసత్వ అలవాటుగా మిగిలిపోయింది. ఇది కొత్త రాజకీయ పరిస్థితుల ఆధారంగా తీసుకున్న ఆలోచనాత్మక నిర్ణయం ఎంత మాత్రం కాదు. ఇది మన ప్రజాస్వామిక పాలనలో ఒక తిరోగమనం, సందేహం లేదు. 1990లో ప్రాంతీయ పార్టీల ప్రాభవ ప్రాబల్యాలు, ప్రాంతీయ సంకీర్ణ ప్రభుత్వాలు ఆ తిరోగమనాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. గత దశాబ్దంలో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. కేంద్రని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా, తమ భావజాల స్ఫూర్తితో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి తీవ్ర విఘాతం కలిగించడంతో కేంద్ర–రాష్ట్ర సంబంధాలలో అసమతుల్యతలు తలెత్తాయి. ఆర్థిక వ్యవహారాలలో, పాలనాపరమైన విషయాలలో అధికారాల కేంద్రీకరణ మరింతగా పెరిగింది. రాష్ట్రాలను సమాన వ్యక్తులుగా కాకుండా మునిసిపాలిటీల స్థాయి పాలనా విభాగాలుగా పరిగణించే ధోరణులు పెరిగిపోయాయి. దేశ పాలనలో సమాఖ్య స్ఫూర్తి బాగా క్షీణించింది.

‘తనలో భాగంగా ఉన్న రాష్ట్రాలను పూర్తిగా విశ్వసించే, వాటి సమ భాగస్వామ్యాన్ని గౌరవించే, స్థానిక ప్రభుత్వాలకు సాధికారత కల్పించే సమాఖ్య వ్యవస్థ దేశ సార్వభౌమత్వాన్ని బలహీనపరచదు; ప్రజాస్వామ్యాన్ని ప్రగాఢమూ, విశాలమూ చేస్తుంది’ అని న్యాయమూర్తి కురియన్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. అటువంటి సమాఖ్య వ్యవస్థ సమైక్యంగా సుస్థిరంగా ఉండడమనేది ‘ఆదేశించడం కాకుండా ఏకాభిప్రాయ సాధనతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల, భాష మొదలైన విషయాలలో ఆధిపత్యానికి ఆస్కారం లేకుండా సంప్రదింపులతో సర్దుబాట్లు చేయడం వల్ల, అధికారాల కేంద్రీకరణతో కాకుండా వాటి సూత్రబద్ధత పంపిణీతో సాధ్యమవుతుందని’ న్యాయమూర్తి కురియన్‌ నివేదించారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఏ భావి సంభాషణ అయినా ఈ అవగాహనతోనే ప్రారంభమవ్వాలి.

భారత సమాఖ్యవాదం పాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల శాసనం, పాలన అధికారాలలో జోక్యం చేసుకుంటోందని, ఆర్థిక రంగంలో కూడా అదే ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని న్యాయమూర్తి కురియన్‌ నివేదిక వాదించింది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు వివిధ రంగాలలో సంస్కరణలు తక్షణావశ్యకమని అభిప్రాయపడింది. ముందుగా రాష్ట్రాల సరిహద్దులను మార్చడం అంటే రాష్ట్రాల ప్రాదేశిక పునర్వ్యవస్థీకరణలో కేంద్ర ప్రభుత్వ అధికారాలకు పరిమితి ఉండాలని, రాజ్యాంగాన్ని సవరించడంలో రాష్ట్రాలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోకూడదని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక సంస్కరణలతో పోల్చదగిన స్థాయిలో 1991 ఆర్థిక సంస్కరణలతో పోల్చదగిన స్థాయిలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో తిరిగి సాధించాలని కురియన్‌ కమిటీ నివేదిక కోరింది. విద్యను ఉమ్మడి జాబితా నుంచి తొలగించి మళ్లీ రాష్ట్ర జాబితాలో చేర్చాలని, రాష్ట్రాల అధికార పరిధిలోని ఆరోగ్య భద్రత, వ్యవసాయం తదితర రంగాలలో కేంద్ర ప్రభుత్వ చొరబాటును అడ్డుకోవాలని కూడా న్యాయమూర్తి కురియన్ కమిటీ ప్రకటించింది. రాజకీయ వ్యవస్థల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గవర్నర్లు తమ విధ్యుక్త ధర్మ నిర్వహణలో పక్షపాత వైఖరితో నిర్ణయాలు తీసుకోవడాన్ని అడ్డుకునేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు చేపట్టాలని సూచించింది.

రాజకీయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై ప్రతిపాదనలు ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ భావనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇది పూర్తిగా సబబే. ప్రజానన రేట్లు స్థిరీకృతమయ్యే వరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను వాయిదా వేయాలని న్యాయమూర్తి కురియన్‌ కమిటీ సూచించింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే అధికార ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను శాశ్వతంగా నిలిపివేయాలి. కేంద్రం–రాష్ట్రాల ఆర్థిక సంబంధాలపై విపులంగా సమీక్ష జరిగింది. వస్తు సేవా పన్ను వ్యవస్థ సమాఖ్యవాదాన్ని దెబ్బతీసిందని కురియన్ కమిటీ అభిప్రాయపడింది. ఆ పరోక్ష పన్నుల వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ప్రస్తుత ఉత్పత్తులకు పలు ప్రత్యామ్నాయాలను సూచించింది. భాషాపరమైన సమరూపత ఉన్నప్పుడే జాతీయ సమైక్యత సుసాధ్యమవుతుందని భావించడం సమంజసం కాదని న్యాయమూర్తి కురియన్‌ కమిటీ స్పష్టం చేసింది. అయితే హిందీ ఆధిపత్యాన్ని తిరస్కరించడంలో ఆంగ్ల భాషకు అమిత ప్రాధాన్యమిచ్చారు. అలా కాకుండా దేశీయ భాషలు అన్నిటికీ సమ ప్రాధాన్యమిచ్చి ఉంటే అది ఆ నివేదిక స్ఫూర్తికి అనుగుణంగా ఉండేది.

ఏమైనా ఒక కొత్త సమాఖ్య ఒప్పందాన్ని (ఫెడరల్‌ కంపాక్ట్‌) కుదుర్చుకోవల్సిన అవసరం ఒక ప్రతిభావంతమైన సంభాషణను జస్టిస్‌ కురియన్‌ కమిటీ ప్రారంభించింది. అటువంటి సంభాషణ రాజ్యాంగం, విధాన ఆచరణాత్మక తర్కాన్ని దాటి నాగరికతా సంబంధ ఆలోచనా రీతులకు వెళ్లాలి. స్థిరమైన, సార్వత్రిక నైతిక ఆశ్యకతలను అన్వయించడం కంటే సందర్భోచితమైన నైతిక తార్కికతే భారతీయ తాత్విక సంప్రదాయాలను నిర్వచించే ప్రధాన లక్షణంగా భావించబడుతుంది. విస్తృతంగా అంగీకృతమయిన స్థానిక సంప్రదాయాలు, ధర్మాచరణలు, నియమ నిబంధనల ప్రాతిపదికన ఈ సువిశాల దేశ వైవిధ్యాన్ని గుర్తించి, గౌరవించాలి. భారత ఉపఖండాన్ని సమర్థంగా పరిపాలించడానికి ఆ వైవిధ్యాన్ని గౌరవించడమే సరైన మార్గమని మహాశక్తిమంతమైన మౌర్య, గుప్త సామ్రాజ్యాలతో పాటు మొగల్, బ్రిటిష్ సామ్రాజ్యాలు గుర్తించబడ్డాయి. కేంద్రీకృతమైన, ఏకీకృత చైనీస్‌ రాజ్య వ్యవస్థ కాకుండా భారతీయ రాజ్యం సంయోజిత లక్షణం కలిగి ఉన్నది. భారతదేశ ఐక్యత పైనుంచి విధించబడినది కాదు. విభిన్న ప్రాంతీయ రాజ్యాలు, భాషలు, సంస్కృతుల ద్వారా ఏర్పడి నిలకడగా ఉన్నది. భారత్ సమాఖ్య అమెరికా సమాఖ్యకు భిన్నమైనది. సార్వభౌమిక రాష్ట్రాలు స్వచ్ఛందంగా కలిసిరావడంతో అమెరికా సమాఖ్య ఏర్పడింది. అందుకు భారత్‌, రాష్ట్రాలను కలిపి ఉంచే సమాఖ్య వ్యవస్థలోని మన సమాఖ్యలో ప్రతి భాగస్వామ్య రాష్ట్రమూ తన సొంత విలక్షణ గుర్తింపును నిలుపుకుంటుంది. ఈ వాస్తవాల దృష్ట్యా అధికారాల కేంద్రీకరణ అనేది మన నాగరికత విలువలకు విరుద్ధమైనది.

హిందీయేతర రాష్ట్రాల మధ్య హిందీ అధికార మార్పుపై నిర్మొహమాటపు చర్చతో కొత్త సమాఖ్య ఒప్పందంపై సంభాషణ ప్రారంభమవ్వాలి. భాషా రుద్దబోమని హామీ ఇస్తూ చట్టసభలలో తమ రాజకీయ హిందీ 1971లో ఉన్న విధంగానే హిందీ రాష్ట్రాలు అంగీకరించాలి. ఉత్తర, తూర్పు భారతదేశంలోని పేద రాష్ట్రాలకు మరింత ఆర్థిక వనరులు సమకూరేలా కేంద్ర ప్రభుత్వ ఆదాయ సమాన పంపిణీ కొనసాగడానికి దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాలు అంగీకరించాలి. ఏకపక్ష రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక ఆధిపత్యాలకు తావులేకుండా సమ్మిళితత్వం వర్ధిల్లడమే శాశ్వత, ధర్మబద్ధమైన గణతంత్ర రాజ్యానికి పునాది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవి కూడా చదవండి

మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం

మీ పరిశీలన శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 26 , 2026 | 03:07 AM



Source link

Spread the love