
టీ20 ప్రపంచకప్లో తుది సమరానికి ఇంకొక్క రోజే సమయం ఉంది. ఆదివారం న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది టీమ్ఇండియా. అయితే మన జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అయినా.. ఇప్పుడు సొంతగడ్డపై ఆడుతున్నా.. ప్రత్యర్థికి ఇప్పటిదాకా ఏ ఫార్మాట్లోనూ ప్రపంచకప్ గెలిచిన చరిత్రే లేకపోయినా.. భారత్ కప్పు ·నెగ్గుతుందని ధీమాగా చెప్పలేని పరిస్థితి! అందుక్కారణం.. ఇప్పటిదాకా టోర్నీలో జట్టు ప్రదర్శన సాధికారంగా లేకపోవడం, కొన్ని బలహీనతలు స్పష్టంగా కనిపించడం. టీమ్ఇండియా పడుతూ లేస్తూ ఫైనల్కైతే వచ్చేసింది కానీ.. కప్పు దక్కాలంటే మాత్రం తుది పోరులో భిన్నమైన ఆట ఆడాలి, వ్యూహాలు మారాలి.
ఈనాడు క్రీడావిభాగం

వరుణ్
సంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు.. అంచనాలకు తగ్గట్లే ఫైనల్కు చేరుకుంది. ఇది సంతోషాన్నిచ్చే విషయమే కానీ.. టోర్నీలో భారత్ ఇప్పటిదాకా సిసలైన ఛాంపియన్లా ఆడలేదన్నది వాస్తవం. అయితే ఛాంపియన్లాగే ఆడిన దక్షిణాఫ్రికా.. సెమీస్లో చిత్తుగా ఓడిన నేపథ్యంలో ఆట ఎలా సాగినా, గెలుపే ముఖ్యం. అలాగే ఫైనల్లోనూ భారత్ గెలిచి కప్పు పట్టేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ గత మ్యాచ్ల అనుభవాలను బట్టి చూస్తే.. భారత్ ఆటతీరుతో పాటు వ్యూహాలు మార్చక తప్పని పరిస్థితి.
భారత్కు అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం బౌలింగే. జస్ప్రీత్ బుమ్రాను మినహాయిస్తే నమ్మదగ్గ బౌలరే కనిపించడం లేదు. సెమీఫైనల్లో మరో ప్రత్యామ్నాయం కనిపించక.. భారత్ ఎంతో ఇబ్బంది పడింది. ఎవరికి బౌలింగ్ ఇచ్చినా కష్టమే అనిపించింది. బుమ్రా కాకుండా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తేలిపోయారు. పేసర్లు అర్ష్దీప్, హార్దిక్ సైతం అంత ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేదు. వీళ్లిద్దరి కోట అయిపోవడంతో.. అక్షర్తో చివరి ఓవర్ వేయించలేక పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబెకు బంతి అప్పగించాడు కెప్టెన్. అతను తొలి మూడు బంతులు కట్టుదిట్టంగా వేయడంతో భారత్ బయటపడింది. కానీ తర్వాత మూడు బంతులకు అతను సిక్సర్లు ఇచ్చేశాడు. ఆ షాట్లు తొలి మూడు బంతుల్లో పడి ఉంటే కథ వేరుగా ఉండేదే. దూబెను బౌలింగ్కు దించాల్సి రావడమే జట్టు దుస్థితికి నిదర్శనం. బౌలింగ్ ప్రత్యామ్నాయాలు అంతంతమాత్రంగా ఉండటం, సరైన ప్రణాళిక లేకపోవడం భారత్కు చేటుగా మారింది.
సూపర్-8 నుంచి వరుణ్ చక్రవర్తి వైఫల్యం జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ. అతడి ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బ తిన్నట్లు మారాయి. ఈ నేపథ్యంలో కుల్దీప్నులో ఆడుకునే పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. పిచ్ మరీ స్పిన్నర్లకు అనుకూలం అంటే.. వరుణ్, అక్షర్లకు తోడు కుల్దీప్ను కూడా ఆడించడమూ కలిసి రావచ్చు. రెండో స్పెషలిస్టు పేసర్ అర్ష్దీప్.. కొన్నిసార్లు అద్భుతమైన బంతులు సంధిస్తాడు, కొన్ని బంతులు పేలవంగా వేస్తాడు. సెమీస్ లాంటి కీలక మ్యాచ్లో వరుసబెట్టి వైడ్లు వేయడం అనూహ్యం. అర్ష్దీప్ కంటే సిరాజ్ మెరుగైన ప్రత్యామ్నాయమా అన్నది ఆలోచించాలి. ప్రపంచకప్ తొలి మ్యాచ్లో అమెరికాపై అతను భలే బౌలింగ్ చేశాడు.
న్యూజిలాండ్ జట్టుకు తిరుగులేని బ్యాటింగ్ బలముంది. ముఖ్యంగా ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ సెమీస్తో సహా ఈ టోర్నీలో ఎలా రెచ్చిపోయారో. ఇంకా ఫిలిప్స్, మిచెల్, రచిన్ లాంటి మేటి బ్యాటర్లు ఆ జట్టు సొంతం. పిచ్కు, ఆయా బ్యాటర్లకు తగ్గట్లుగా పకడ్బందీ వ్యూహాలతో సిద్ధం కాకపోతే కష్టం. వికెట్ను అనుసరించి, బ్యాటర్ల బలహీనతలను గుర్తించి బంతులేయడం.. ఫీల్డింగ్తోనూ ఉచ్చుబిగించడం చాలా అవసరం. అదనపు పరుగుల విషయంలోనూ జాగ్రత్త పడాలి. జట్టు కూర్పు విషయంలో నేర్పుగా వ్యవహరించడంతో పాటు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే కివీస్ బ్యాటర్లను ఆపడం కష్టమవుతుంది. బుమ్రాతో పవర్ప్లేలో రెండు ఓవర్లు వేయించాలన్న గావస్కర్ లాంటి దిగ్గజాల సలహా గురించి టీమ్ఇండియా ఆలోచించాలి. అందులోనూ అలెన్, సీఫర్ట్ లాంటి ప్రమాదకారులను ఆపడానికి ఇది మరింత అవసరం.

అర్ష్దీప్