
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహిళామణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం.. నేడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోందని చెప్పారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలను అమలు చేస్తోందని వెల్లడించారు. మెగా డీఎస్సీ ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు.
కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సమాజాభివృద్ధికి మహిళా సాధికారత ప్రమాణమని.. ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం దినోత్సవం సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మనిచ్చిన అమ్మ .. జీవితాంతమూ మనల్ని కంటికి రెప్పలా కాచే మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు చెప్పారు. తాత తెలుగింటి ఆడపడుచులకు అన్న అయ్యి ఆస్తి హక్కు ఇచ్చారని.. తన తండ్రి మహిళా సాధికారతకు స్వయంశక్తి సంఘాలను ఆరంభించారని గుర్తు చేశారు.