
మందమర్రి పట్టణం: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక పదోతరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో విషాదం నింపింది. ఎస్సై నరేశ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అంగడిబజార్ సీఎస్పీ ప్రాంతానికి చెందిన దంపతుల కుమారుడు (15) స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. ఎంత చదివినా ఏ పరీక్షలోనైనా పాస్ మార్కులు మాత్రమే వస్తుండటంతో తల్లిదండ్రులకు చెప్పుకొంటూ బాధపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తల్లి నిద్రలేపి చదువుకొమ్మని చెప్పారు. కాసేపటి తర్వాత వచ్చి చూసే సరికి ఇంట్లో ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. మార్కులు తక్కువ వస్తున్నాయనే ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు ముందు విద్యార్థి ‘నన్ను క్షమించు అమ్మ, చెల్లి.. ఐ లవ్యూ నాన్న’ అంటూ లేఖ రాశాడు. కుటుంబ సభ్యుల రోదన స్థానికులను కంటతడి పెట్టించింది.