భారతదేశంలోని టాప్ 10 హిల్ స్టేషన్లు:బయట ఎండలు మండిపోతున్నాయి.. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏసీలు కూడా సరిపోని ఈ వేడి నుంచి తప్పించుకోవాలంటే.. హిమాలయాల ఒడిలోకి లేదా నీలగిరి కొండల మధ్యలోకి వెళ్లాల్సిందే! మరి 2026 సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ 10 బెస్ట్ స్పాట్స్ మీ కోసమే. కేవలం విహారయాత్ర మాత్రమే కాదండోయ్ .. ఇది మీ సోల్కి మంచి రీఛార్జ్ కూడా !
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్: కొండల రారాజు!
సిమ్లా ఒక ఎవర్ గ్రీన్ డెస్టినేషన్. దీనిని ‘క్వీన్ ఆఫ్ హిల్స్’ అని ఎందుకు అంటారో అక్కడ అడుగు పెడితేనే తెలుస్తుంది. బ్రిటిష్ కాలం నాటి నియో-గోథిక్ నిర్మాణ శైలిలో ఉండే భవనాలు, ప్రసిద్ధ మాల్ రోడ్ లోని సందడి పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇక్కడ సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తులో ఉండే జాఖూ ఆలయం వద్ద ఉన్న భారీ హనుమంతుడి విగ్రహం ప్రధాన ఆకర్షణ. సిమ్లా నుండి 15 దూరంలో ఉండే కుఫ్రిలో గుర్రపు స్వారీ, హిమాలయన్ నేచర్ పార్క్ సందర్శన పిల్లలకు, పెద్దలకు ఒక మంచి అనుభూతిని ఇస్తాయి.
మనాలి, హిమాచల్ ప్రదేశ్: అడ్వెంచర్ అడ్డా!
దీని తర్వాత హిమాచల్ లోనే మరో అద్భుతం మనాలి. యువత ఎక్కువగా ఇష్టపడే ఈ ప్రదేశంలో సోలాంగ్ వ్యాలీలో పారాగ్లైడింగ్ చేయడం, రోహ్తాంగ్ పాస్ వద్ద సమ్మర్లో కూడా మంచుతో ఆడుకోవడం ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇక్కడి బియాస్ నదిలో వైట్ వాటర్ రాఫ్టింగ్ మీలో అడ్రినాలిన్ రష్ను పెంచుతుంది. పాత మనాలిలోని కేఫ్లు, హిడింబా దేవి ఆలయం ఇక్కడి సంస్కృతికి అద్దం పడతాయి.
మున్నార్, కేరళ: పచ్చని తివాచీ!
దక్షిణ భారతదేశం వైపు చూస్తే, కేరళలోని మున్నార్ ఒక పచ్చని తివాచీ పరిచినట్లుగా ఉంటుంది. ఇక్కడి టీ ఎస్టేట్లు, ముఖ్యంగా టాటా టీ మ్యూజియం సందర్శన ద్వారా తేయాకు తయారీ ప్రక్రియను దగ్గరగా చూడొచ్చు. ఎరవికులం నేషనల్ పార్క్లో అరుదైన నీలగిరి తార్లను చూడటం, ఆనైముడి శిఖరం అందాలను ఆస్వాదించడం ప్రకృతి ప్రేమికులకు ఒక వరం.
ఊటీ, తమిళనాడు: క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్లు!
తమిళనాడులోని ఊటీలో నీలగిరి మౌంటైన్ రైల్వే (టాయ్ ట్రైన్) ప్రయాణం యునెస్కో గుర్తింపు పొందింది; ఇది లోయలు, సొరంగాల గుండ వెళ్తుంటే కలిగే అనుభూతి వర్ణనాతీతం. దొడ్డబెట్ట శిఖరం నుండి మొత్తం నీలగిరి కొండల వ్యూ చూడొచ్చు.
కూర్గ్, కర్ణాటక: ఇండియా స్కాట్లాండ్!
కర్ణాటకలోని కూర్గ్ లేదా కొడగు ప్రాంతం కాఫీ తోటలకు పెట్టింది పేరు. ఇక్కడ తలకావేరి వద్ద కావేరి నది పుట్టుకను చూడటం, అబ్బే జలపాతాల హోరును ఆస్వాదించడం గొప్పగా ఉంటుంది. ఇక్కడి దుబారే ఎలిఫెంట్ క్యాంప్లో ఏనుగులతో గడపడం పర్యాటకులకు ఇష్టమైన పని.
నైనిటాల్, ఉత్తరాఖండ్: లేక్ డిస్ట్రిక్ట్!
ఉత్తరాఖండ్ నైనిటాల్ ఒక అందమైన లోయలో, కంటి ఆకారంలో ఉండే సరస్సు చుట్టూ ఉంటుంది. ఇక్కడ నైనీ లేక్లో బోటింగ్ చేస్తూ చుట్టూ ఉన్న ఏడు కొండలను చూడటం చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్నో వ్యూ పాయింట్ నుండి హిమాలయాల అంచులను వీక్షించవచ్చు.
కూడా చదవండి:థియేటర్లు: థియేటర్లు ఇక మూసుకోవాల్సిందేనా ?
మసూరీ(ముస్సోరీ), ఉత్తరాఖండ్: పర్వతాల రాణి!
దీనికి సమీపంలోనే ఉండే ముస్సోరీ, డూన్ వ్యాలీకి అద్భుతమైన గమ్యస్థానం. ఇక్కడి కెంప్టీ ఫాల్స్ వద్ద జలపాతాల కింద స్నానం చేయడం, గన్ హిల్ పాయింట్ వరకు రోప్ వే లో వెళ్లడం పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్: టీ ఎస్టేట్ మేజిక్!
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ తన టీ తోటలతో పాటు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్లలో ఒకటైన ‘ఘూమ్’ కు ప్రసిద్ధి. ఉదయాన్నే టైగర్ హిల్ వద్ద సూర్యోదయం సమయంలో కాంచన్జంగా పర్వతం బంగారంలా మెరిసిపోవడం ఒక అద్భుత దృశ్యం.
షిల్లాంగ్, మేఘాలయ: స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్!
ప్రకృతిని అత్యంత దగ్గరగా చూడాలంటే మేఘాలయంలోని షిల్లాంగ్ వెళ్లాలి. ఇక్కడి జలపాతాలు ఎలిఫెంట్ ఫాల్స్ ,పైన్ అడవులు మరియు ఉమియం లేక్ అందాలతో ‘స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్’ అనిపించింది.
మౌంట్ అబు, రాజస్థాన్: ఎడారిలో అద్భుతం!
చివరగా రాజస్థాన్లోని మౌంట్ అబు, ఎడారి ఎండల మధ్య ఒక చల్లని ఆశ్రయం లాంటిది. ఇక్కడి నక్కి సరస్సులో సాయంత్రం వేళ బోటింగ్ చేస్తూ సన్ సెట్ పాయింట్ వద్ద సూర్యాస్తమయాన్ని చూడటం ఈ యాత్రకు మంచి కంప్లీషన్ ఇస్తుంది.
సో ..ఈ 10 ప్రదేశాల్లో మీరు ఏది ఎంచుకోవాలో, ఈ 2026 వేసవిలో మీ జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం.