పన్ను ఎగవేతదారులపై తెలంగాణ సర్కార్ దృష్టిపెట్టింది. ఇకపై పన్ను ఎగవేతదారులను ఉపక్షించేది లేదని చెబుతోంది. ఇందులో భాగంగా కొత్త పోర్టల్ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోంది. సీఎస్ నేతృత్వంలోని రెవెన్యూశాఖ విభాగాల కార్యదర్శులతో అధ్యయన కమిటీని నియమించింది.

ఆదాయం తెచ్చే శాఖలు అన్నింటినీ కలిపి.. రేవన్(RevOne) పోర్టల్ను అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతోంది. శాఖల మధ్య డేటా మార్పిడి, పర్యవేక్షణకు పోర్టల్ను రూపొందిస్తారు. స్థానిక సంస్థల వినోదపు పన్ను వసూలు, యూపీఐ, పీవోఎస్ లావాదేవీలపై నిఘా పెట్టేలా కొత్త చట్టం ఏర్పాటులాంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీ అధ్యయనం చేసి రిపోర్టును సమగ్రంగా పొందుపరచనుంది. 30 రోజుల్లో ప్రాథమిక, 60 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. రైతులకు భూ భద్రత కల్పిస్తూ, సులభరతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల భూభారతి పోర్టల్ రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ నూతన ఇంటిగ్రేటెడ్ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలను ఉపయోగించుకుంటున్నారు.
,ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి భూయజమానికి వారి భూమికి ప్రత్యేకంగా భూధార్ నంబర్ను కేటాయిస్తారు. భూమి వివరాల్లో పారదర్శకత పెరిగి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇకపై భూమి రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం డాక్యుమెంట్లు మాత్రమే కాదు, క్షేత్రస్థాయి కొలతలతో కూడిన మ్యాప్ను కూడ జత చేయడం జరుగుతుంది. అమ్మేవారి నుంచి కొనేవారికి భూమిని కొలిచి అప్పగించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది.
పాతకాలపు గొలుసు పద్ధతులకు స్వస్తి పలికి, అంగుళం కూడా తేడా లేకుండా కొలతలు తీసే రోవర్ యంత్రాలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందుకోసం 5300 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతి మండలానికి 6 నుంచి 7 మందిని కేటాయించారు.