
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి ఆయుష్ శెట్టి మినహా మిగిలిన భారత షట్లర్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 18–21, 8–21తో రెండో సీడ్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో ఉన్నతి హుడా 17–21, 9–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుష్ శెట్టి 21–16, 21–12తో ప్రపంచ 20వ ర్యాంకర్ చి యు జెన్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12–21, 19–21తో వెంగ్ హ్యాంగ్ యాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 13–21, 14–21తో నాలుగో సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ మ్యాచ్లో శ్రుతి మిశ్రా–ప్రియ (భారత్) జోడీ 10–21, 13–21తో యూకీ ఫకుషిమా–మయు మత్సుమోటో (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది.