అలాగే… శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో మంత్రులు అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి పి.నారాయణ ప్రవేశపెట్టారు.
మొత్తం బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు
భారీగా మార్కెట్ అప్పులు, కేంద్రం నుంచి రుణాలతో ప్రజలపై పెనుభారం మోపడమే లక్ష్యంగా 2025–26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభకు సమర్పించారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా అప్పులు, పన్నులు, పన్నేతర వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రజారుణం కింద ఏకంగా రూ.1.03 లక్షల కోట్లు అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు.
పన్నుల ఆదాయం రూపంలో వచ్చే ఆర్థిక ఏడాది అదనంగా రూ.15 వేల కోట్లు వస్తాయని, పన్నేతర ఆదాయం ద్వారా అదనంగా రూ.12 వేల కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. 2024–25 రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.94,966 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో సొంత పన్నుల ఆదాయం రూ.1,09,006 కోట్లుగా అంచనా వేశారు.
పన్నేతర ఆదాయం 2024–25లో రూ.7,018 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో ఏకంగా రూ.19,119 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంటే పన్నులు, పన్నేతర రూపంలో ప్రజల జేబులను ఖాళీ చేయడమే లక్ష్యంగా బడ్జెట్ అంచనాలున్నట్లు వెల్లడవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం కింద రూ.81,956.50 కోట్ల అప్పులు, కేంద్రం నుంచి రూ.21,700 కోట్ల అప్పు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. అంటే మొత్తం ప్రజా రుణం కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,03,656.50 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు బడ్జెట్లో ఆ ఊసే లేకుండా చేశారు.
ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. పైగా భారీ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు బడా సంస్థలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కోసం బడ్జెట్లో ఏకంగా రూ.2000 కోట్లు కేటాయించడం గమనార్హం. మొత్తం మీద పన్నుల రూపంలో ఇటు భారీ ఆదాయం, అటు భారీ అప్పులతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.51 లక్షల కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు.
రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 1.82 శాతమని వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 4.38 శాతమని చెప్పారు. మద్యం ద్వారా 2025–26లో రూ.27,097 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.13,150 కోట్లు ఆదాయం రానుందని అంచనా వేశారు.
‘తల్లికి వందనం’ పథకం
‘తల్లికి వందనం’ పథకంపై కూటమి ప్రభుత్వం మరోసారి అంకెల గారడీ చేసింది. ఈ పథకం కింద ఎంతమందికి సాయం అందిస్తారనేది చెప్పకుండా బడ్జెట్లో రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించి కనికట్టు చేసేందుకు ప్రయత్నించింది. కొత్తగా ‘ప్రతి విద్యార్థి తల్లికి’ సాయం అంటూ చంద్రబాబు మార్క్ మోసానికి తెరతీసింది. ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు.
‘సూపర్ సిక్స్’ హామీలకు వచ్చేసరికి ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ రూ.15వేలు ఇస్తామని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ 2024–25లో తల్లికి వందనం పథకానికి రూ.5,387 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. కానీ, పైసా ఇవ్వలేదు. ఒక్క విద్యార్థికి సాయం అందించలేదు. 2025–26 బడ్జెట్లో ఈ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుందని కొత్త ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం అందించిన యూడైస్ ప్లస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 87.42 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటే రూ.13,113 కోట్లు అవసరం. కేటాయించింది రూ.9,407 కోట్లే. అంటే మొత్తం విద్యార్థుల్లో 24.70 లక్షల మందికి కోత పెట్టక తప్పదు. అందుకే ‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుందని కొత్త పల్లవి అందుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యాశాఖకు తగ్గిన కేటాయింపులు
రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు (9.86 శాతం) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదే 2024–25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లతో ప్రతిపాదనలు చేయగా, ఇందులో పాఠశాల విద్యకు రూ.29,909.31 (10.15శాతం) కోట్లు కేటాయించారు. అయితే, చేసిన ఖర్చు మాత్రం రూ.28,560.64 కోట్లే. ఈ మొత్తం వేతనాలు, అలవెన్సులకే సరిపోయింది.
ప్రస్తుత బడ్జెట్లో రూ.31,805 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా, ఆ మొత్తం ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులకే సరిపోతాయి. అలాగే, 2024–25 బడ్జెట్లో ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటనకే పరిమితమైంది. తాజా బడ్జెట్ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని కూటమి సర్కారు రెండోసారి ఎంతో గొప్పగా చెప్పుకోవడం గమనార్హం.
‘నాడు–నేడు’ ప్రశ్నార్థకం
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మన బడి నాడు–నేడు’ పథకం రెండో విడతలో రూ.8వేల కోట్ల బడ్జెట్తో 23 వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే రూ.4 వేల కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులు పూర్తికావాలంటే మరో రూ.4 వేల కోట్లు అవసరం.
కూటమి ప్రభుత్వం ఈ పథకానికి ‘మన బడి–మన భవిష్యత్తు’గా పేరు మార్చి 2024–25 బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. అలాగే, 2025–26 బడ్జెట్లోనూ రూ.1,000 కోట్లు కేటాయింపునకు ప్రతిపాదించారు. దీంతో మన బడి–మన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఉచిత బస్కు రెడ్ సిగ్నల్
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి రెడ్ సిగ్నల్ చూపించారు. ఈ పథకం గురించి బడ్జెట్లో కనీస ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ప్రజా రవాణా విభాగం(ఆర్టీసీ)కి అరకొర కేటాయింపులతో సరిపెట్టి… ఈ ఏడాది కూడా మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అమలు చేసేది లేదని తేల్చేశారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు డబ్బా కొట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విషయాన్ని విస్మరించారు. కర్ణాటక, తెలంగాణలలో ఉచిత బస్ పథకం అమలు తీరుపై అధ్యయనం అంటూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. గత ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. అనంతరం దసరాకు వాయిదా వేశారు.
ఆ తర్వాత 2025 జనవరి 1 నుంచి అన్నారు.. కాదు కాదు.. ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఖాయమన్నారు. తీరా బడ్జెట్లో అసలు ఆ పథకం ప్రస్తావనే లేదు.
ఆర్టీసీకి కేవలం..
2025–26 వార్షిక బడ్జెట్లో ఆర్టీసీకి కేవలం రూ.4,309.85 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలకే ఏడాదికి రూ.3,600 కోట్లు వెచ్చించాలి. మిగిలిన రూ.700 కోట్లు ఆర్టీసీ సాధారణ నిర్వహణ వ్యయానికే సరిపోవు. ఇక మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు లేనట్టే.
చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,182 కోట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నివేదించారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే కొత్తగా 2,045 బస్సులు కొనుగోలు చేయడంతోపాటు 11,479 మంది అదనపు ఉద్యోగులను నియమించాలని స్పష్టంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో ఈ పథకం కోసం రూపాయి కేటాయించలేదు. ఇక కొత్త బస్సుల కొనుగోలు గురించి పట్టించుకోలేదు.
తీవ్రంగా నష్టపోతున్న మహిళలు
- ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు.
- రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వారిలో మహిళలు 50 శాతం.. అంటే 20 లక్షల మంది ఉంటారని అంచనా.మహిళల టికెట్ల ద్వారా నెలకు రూ.265కోట్లు రాబడి వస్తోంది.
- ఉచిత బస్ పథకాన్ని అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో మహిళా ప్రయాణికులు నెలకు రూ.265 కోట్లు చొప్పున నష్టపోతున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు టీడీపీ కూటమి వల్ల గత 9 నెలల్లో మహిళలు రూ.2,385 కోట్లు నష్టపోయారు.
- 2025–26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ పథకాన్ని అమలు చేసే ఉద్దేశం లేదని బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర మహిళలు వచ్చే 2025–26 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.3,182 కోట్లు నష్టపోవడం ఖాయమని తేటతెల్లమైంది. చంద్రబాబు మార్కు మోసం అంటే ఇదీ.
58 లక్షల మందికి గ్యాస్ కోత!
పేదింటి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామన్న టీడీపీ కూటమి పార్టీల ఎన్నికల హామీ క్రమంగా మసకబారుతోంది. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా చేతులెత్తేసింది. ఫలితంగా.. దశాబ్దాల తరబడి రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉండి కూడా అర్హులైన కుటుంబాలకు పథకం వర్తింపు మిథ్యగానే మిగిలిపోతోంది.
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి నామమాత్రపు నిధులను కేటాయించడమే ఇందుకు కారణం. కేవలం 90.1 లక్షల కుటుంబాలకు మాత్రమే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు మాత్రమే కేటాయించింది.
- ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు
- ఏటా ఇవ్వాల్సింది రూ.4,000 కోట్లు
- బడ్జెట్లో కేటాయించింది రూ.2,601 కోట్లు
లబ్దిదారుల సంఖ్యలో భారీ కోత..
తెల్లరేషన్ కార్డున్న వారికి మాత్రమే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన ఏపీలోని 1,48,43,671 కార్డుదారులకు గ్యాస్ రాయితీ అందాల్సి ఉంది. ఇందుకోసం రూ.4 వేల కోట్లు కావాలి. కానీ, బడ్జెట్లో మాత్రం 90.1 లక్షల మందికి మాత్రమే రాయితీ ఇస్తామని చెప్పి లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత పెట్టింది. ఇలా దాదాపు 58 లక్షల మందికి పైగా అర్హులను నిలువునా బాబు సర్కారు మోసంచేసింది.
2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చేందుకు వీలుగా గత బడ్జెట్లో రూ.895 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన కోటి మంది లబ్దిదారులకు గ్యాస్ రాయితీ దక్కాలి. కానీ, 93 లక్షల మందికి మాత్రమే రాయితీ వర్తించినట్లు.. వీరికి రూ.686 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఈనెల 25న సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అసెంబ్లీలో ప్రకటించారు.
ప్రస్తుత గ్యాస్ ధరల ప్రకారం ఒక్కో సిలిండర్కు రూ.850 చొప్పున రాయితీ విడుదల చేస్తే సుమారు రూ.790 కోట్లు ఖర్చవుతుంది. కానీ, చంద్రబాబు చెప్పినదానిని బట్టి చూస్తే రూ.100 కోట్లకు పైగా చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. పైగా.. వాస్తవ కేటాయింపులు రూ.895 కోట్లు అయితే చెల్లించింది మాత్రం రూ.686 కోట్లే కావడంతో ఉచిత సిలిండర్లకు భారీ కోత విధించినట్లు స్పష్టమవుతోంది.
నిరుద్యోగ భృతిని ముంచిన చంద్రబాబు సర్కారు
నిరుద్యోగ యువతను వంచించడంలో చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వారిని దగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 1999 నుంచి 2024 వరకు ఎన్నికల వేళ అధికారం కోసం ఉద్యోగాల సృష్టి.. నిరుద్యోగ భృతి.. అంటూ ఊదరగొట్టే చంద్రబాబు.. పీఠం ఎక్కిన తర్వాత హామీల తెప్ప తగలేస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భృతి అమలు చేస్తారని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.
కానీ, చంద్రబాబు అండ్ కో సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా 2024–25 బడ్జెట్ను ప్రవేశపెట్టడంలో తీవ్ర జాప్యం చేశారు. తాజా బడ్జెట్లోనూ నిరుద్యోగుల ఊసే విస్మరించారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారు. కూటమి పాలనలో రెండేళ్లలో నిరుద్యోగులు రూ.1,15,200 కోట్లు భృతిని నష్టపోతున్నారు.
- ఏటా నిరుద్యోగులకు ఇవ్వాల్సింది రూ.57,600 కోట్లు
- బడ్జెట్లో కేటాయించింది 0
ఒక్క నోటిఫికేషన్ లేదు..
రాష్ట్రంలో నిరుద్యోగులు చంద్రబాబు ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ నోటిఫికేషన్లు లేవు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తే కూటమి సర్కారు వచ్చిన తర్వాత మెయిన్స్ నిర్వహించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గ్రూప్–1 మెయిన్స్ను ఈ ఏడాది మేకి వాయిదా వేసుకుంటూ వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు కలిపి ఇస్తామని చెప్పి రద్దు చేశారు.
మళ్లీ ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్కు దిక్కులేదు. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క నోటిఫికేషన్ను సరిగ్గా చేపట్టలేక చేతులెత్తేసిన ప్రభుత్వం నిరుద్యోగులకు కనీసం ఆర్థిక సాయం కింద నెలకు రూ.3 వేలు ఇవ్వకుండా మోసం చేసింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అవుట్ సోర్సింగ్, డైలీ వేజస్ వర్కర్ల ఉద్యోగాలను తొలగిస్తోంది.
ఇది చంద్రబాబుకు కొత్తేమీ కాదు..
చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం కొత్తేమీ కాదు. 2014–19 మధ్య రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లకు పైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా, పైసా కూడా ఇవ్వలేదు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఎన్నికలకు ముందు యువ నేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు.
విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించారు. తొలుత 12 లక్షలకు పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చగా.. ఆ తర్వాత పది లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ చెప్పారు. తీరా 1.62 లక్షల మందికే ఇస్తామని, దీనికి ఈ–కెవైసీ లింక్ పెట్టారు. తుదకు అందులోనూ కొంత మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చుకున్నారు.
‘ఫీజు’లో కోత.. విద్యార్థులకు వాత!
ఉన్నత విద్యా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మరోసారి రుజువైంది. నూతన విద్యా విధానాన్ని బలోపేతం చేస్తూ చేపట్టాల్సిన చర్యలు బడ్జెట్లో ఏమాత్రం కనిపించ లేదు. కేవలం వర్సిటీల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, సాంకేతిక విద్యా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,506 కోట్లు కేటాయించారు.
ఐటీఐ, సంప్రదాయ, సాంకేతిక ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అందించే పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్–ఎంటీఎఫ్)ల కేటాయింపుల్లోనూ అలసత్వం ప్రదర్శించినట్టు బడ్జెట్ ద్వారా స్పష్టమైంది. ఏటా రూ.2,800 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్–ఆర్టీఎఫ్) కోసం ఖర్చు చేయాల్సి ఉండగా, బడ్జెట్లో రూ.1,960 కోట్లు మాత్రమే కనిపిస్తోంది.
ఇక హాస్టల్ వసతి ఖర్చులు (పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్–ఎంటీఎఫ్)కు ఏడాదికి రూ.1,100 వ్యయం అవుతుండగా రూ.684 కోట్లు మాత్రమే కేటాయింపులు ఉన్నాయి. చాలా వరకు వివిధ కార్పొరేషన్ల కేటాయింపుల్లో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ల కేటాయింపులను చూపిస్తుండటం గమనార్హం. మొత్తంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్ షిప్లలో సుమారు రూ.1200 కోట్ల మేర కోత విధించినట్టు తెలుస్తోంది.
- ఏటా విద్యార్థులకు ఇవ్వాల్సింది రూ.2,800 కోట్లు
- బడ్జెట్లో కేటాయించింది రూ.1,960 కోట్లు
పెండింగ్ బకాయిలఊసే లేదు
గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలను ప్రభుత్వం నిలిపి వేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్తో విద్యార్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు చేయాలి.
కూటమి ప్రభుత్వం వీటిని ఆపేసింది. దీంతో లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పిడుగులా పడింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కళాశాలల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లులు దిక్కుతోచక పుస్తెలు అమ్మి, తాకట్టుపెట్టి, అధిక వడ్డీలకు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రైవేటు కాలేజీల్లో పీజీ చేరే వారికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు.
ఇప్పుడు ఆ ఊసే మరిచారు. ఇప్పటికి రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులను విస్మరించింది. విద్యకు సంబంధించి కేంద్రం నుంచే సింహ భాగం నిధులు వస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా మోసం చేయడం తగదని విద్యార్థి వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
పదిలక్షల పింఛన్ల కోత!
పేదవాడి పింఛనుపై కూటమి సర్కారు కత్తికట్టింది. ఇప్పటికే కోత కత్తెర పట్టుకుని తిరుగుతున్న ప్రభుత్వం.. బడ్జెట్లో దానికి మరింత పదును పెట్టింది..! చంద్రబాబు సర్కారు కేటాయింపుల ప్రకారం చూస్తే.. ఇది స్పష్టంగా తేలిపోతోంది. లక్ష రెండు లక్షలు కాదు.. ప్రతిపాదిత గణాంకాల ప్రకారం ఏకంగా పది లక్షల పింఛన్లకు కటింగ్ పెట్టే ప్రమాదం నెలకుంది. ఫిబ్రవరి 1న ప్రభుత్వం పింఛన్లు విడుదల చేసిన లబ్ధిదారుల సంఖ్య 63.59 లక్షలు.
వీరికి వచ్చే (2025–26) ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.2,719.50 కోట్ల చొప్పున పంపిణీ చేయాలి. అంటే ఏడాదికి రూ.32,634 కోట్లు. కానీ, బడ్జెట్లో పింఛన్లకు రూ.27,518 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది కావాల్సిన నిధుల కన్నా ఏకంగా రూ.5,116 కోట్లు తక్కువ కావడం గమనార్హం.
ఇప్పటికే కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్
8 నెలల క్రితం వరకు.. ఐదేళ్లు హాయిగా గుండెల మీద చేయి వేసుకొని మరీ ప్రతి నెల ఠంఛనుగా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లక్షల మంది లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడు? ఎలా? తమ పింఛనుకు ఎసరు పెడతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. నిరుడు జూన్లో కూటమి సర్కారు కొలువుదీరాక పింఛన్ల కోతకు సిద్ధపడింది. ఇందుకుతగ్గట్లు లబ్ధిదారుల్లో అనర్హులు ఎక్కువగా ఉన్నారంటూ ప్రచారం సాగిస్తోంది.
ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్నవారు కూడా అర్హత నిరూపించుకోవాలంటూ సర్వే, స్పెషల్ డ్రెవ్ పేరుతో రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వస్తోంది. 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్ అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలింపజేస్తోంది.
50 ఏళ్లకే పింఛన్ అంటూ నమ్మించి..
ప్రస్తుతం కనీసం 60 ఏళ్లున్న దాటినవారికే పింఛన్ పొందేందుకు అర్హత ఉంది. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ముందు.. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల చొప్పున పింఛను ఇస్తామంటూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలు చేయలేదు. ఇంకోవైపు.. ఈ ప్రభుత్వంలో ప్రతి నెల ఇస్తున్న పింఛన్లే ఫిబ్రవరి 1 నాటికి ఏకంగా 1,89,957 తగ్గాయి.
గత ఏడాది మే నెలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 65,49,864 మందికి పింఛను విడుదల చేయగా, కూటమి సర్కారులో ఫిబ్రవరి 1న 63,53,907 మందికే ఇచ్చింది. మరోవైపు, కూటమి ప్రభుత్వం ఏర్పాటు రోజు నుంచే రాష్ట్రంలో పింఛన్ల కోసం కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది. ఈ మేరకు ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి.
‘ఆసరా’కు మనసొప్పలేదు
పేదరికాన్ని తరిమికొట్టి మీ జీవితాలను మార్చేస్తానంటూ తియ్యని మాటలతో బడుగులను నమ్మబలికిన చంద్రబాబు గద్దెనెక్కాక తన నిజస్వారూపాన్ని బయటపె ట్టారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన విద్య, వైద్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కోత పెడుతూ పేదలపై ఆయనకున్నది కక్షేనని బహిర్గతం చేసుకున్నారు. ఇదే పరంపరలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు కోలుకునే సమయంలో చేదోడుగా నిలిచే ‘ఆరోగ్య ఆసరా’ పథకాన్ని చిదిమేశారు.
ఆరోగ్యశ్రీ స్థానంలో బీమాను ప్రవేశపెట్టే క్రమంలో ఆసరాకు ఉద్వాసన పలకాలని గద్దెనెక్కిన రోజే చంద్రబాబు నిశ్చయించుకున్నారు. గతేడాది ఆగస్టు నెల నుంచే చికిత్స పొందిన రోగులకు ఆసరా చెల్లింపులు నిలిపివే శారు. ఈ బడ్జెట్లో ఆసరాకు కేవలం రూ. లక్ష కేటాయించి పేదల వ్యతిరేకినని మరోమారు రుజువు చేసుకున్నారు. ఈ పథకానికి గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 2023-24లో రూ.446 కోట్లు, 2024-25లో రూ.333 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో పథకానికే గండి కొట్టేయడంపట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఐదేళ్లలో రూ.1,465 కోట్లు
పేద, మధ్య తరగతి వారు శస్త్ర చికిత్సల అనంతరం ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలంటే.. ఆ సమయంలో పనికి వెళ్లలేరు. తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులు తట్టుకోలేక పూర్తిగా కోలుకోకుండానే పనులకు వెళ్లిపో తారు. దీంతో మళ్లీ జబ్బులు తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆరోగ్య, ఆర్థిక సమస్యల నుంచి పేద, మధ్య తరగతి రోగులను ఆదుకోవాలనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో వైఎస్సార్ ఆరోగ్య ఆసరాను ప్రవేశపెట్టారు.
ఈ పథకం కింద నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోజే వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లించేది. రోగి/బంధువు ఖాతాల్లో డిశ్చార్జి అయిన 24 గంటల్లో ఆసరా సాయాన్ని జమ చేసే వారు. ఇలా ఐదేళ్లలో 24,59,090 మందికి రూ.1,465.67 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు.
ఆరోగ్యశ్రీకి ఖర్చు చేసింది కొంతే
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు కమ్ము కున్నాయి. 2024-25 సంవత్సరానికి రూ.4 వేల కోట్లు ఆరోగ్య శ్రీ పథకానికి కేటాయించినట్లు బాబు ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ, ఖర్చు చేసింది రూ.2700 కోట్లేనని బడ్జెట్లో ప్రకటించారు. ఇదే వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2023-24 రూ.2,732 కోట్లు పథకం కోసం వెచ్చించారు. ఏటా పథకం ఖర్చులు పెరగాల్సింది పోయి తగ్గిపోవడం బాబు సర్కారులోనే సాధ్యమని పలువురు విమర్శిస్తున్నారు.
బాబు ప్రభుత్వ నిర్వాకం.. 2,450 ఎంబీబీఎస్ సీట్లు లాస్
పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కళాశాలల్ని 2023-24 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చింది.
రెండో దశలో ఈ విద్యా సంవత్సరంలో ఐదు కొత్త కళాశాలలు, మూడో దశలో మరో ఏడు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, చంద్ర బాబు ప్రభుత్వం వచ్చాక కొత్త కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు కట్టబెట్టాలని నిర్ణయించింది. రెండు, మూడో దశలోని కాలేజీలను ప్రారంభించడంలేదని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ కళాశాలలకు బడ్జెట్లో కేటాయింపులు కూడా చేయలేదు.
ముందస్తు ప్రణాళిక ప్రకారం రెండో దశ కింద ఈ విద్యా సంవత్సరంలో పులివెం దుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు కళాశాలలు ప్రారంభమై, 750 సీట్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. మూడో దశ కింద 2025-26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీ పట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలా పురం కళాశాలలు ప్రారంభమై మరో 1050 సీట్లు సమకూరాల్సి ఉంది.
ముందస్తు వ్యూహం ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సిన ఐదు కాలేజీలకు మోకాలడ్డింది. పులివెం దుల కళాశాలను 50 సీట్లతో ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు ఇచ్చినా, వాటిని రద్దు చేయాలని ప్రభుత్వమే లేఖ రాసింది. కేవలం పాడేరు కళాశాలకు మాత్రం 50 సీట్లు లభించాయి.
2025-26 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలలకు అనుమ తుల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) దరఖాస్తుల స్వీకరణ కూడా ముగిసింది. అయినా ఒక్క వైద్య కళాశాలకు కూడా అనుమతుల కోసం ప్రభుత్వం దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం కారణంగా 2024-25లో 700 సీట్లు, 2025-26లో 1,750 సీట్ల చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోతున్నారు.
అప్పులతో దాగుడు మూతలు
అప్పుల వాస్తవాలను కూటమి సర్కారు దాచేసింది. వైఎస్ జగన్ హయాంలో అప్పులపై చంద్రబాబు అండ్ కో చెప్పిన అబద్దాలను కప్పిపుచ్చుకోవడానికి మొత్తం అప్పుల వివరాలు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో చూపకుండా బడ్జెట్ చరిత్రలో తొలిసారి కూటమి సర్కారు ఎగ్గొట్టింది. ఇదే సర్కారు ప్రవేశపెట్టిన గత బడ్జెట్లో జగన్ హయాంలో అప్పులు ఎంతో తెలిసి పోయి, కూటమి నేతలు చెప్పినవన్నీ అవాస్త వాలని తేలిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి అప్పుల వివరాలు వెల్లడిస్తే గత ప్రభుత్వ అప్పులతో పాటు ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు చేసిన అప్పుల బాగోతం బయట పడుతుందని ఆ వివరాల జోలికే వెళ్ల లేదు. బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో ప్రజా రుణం పేరుతో గత ఐదేళ్లలో ఎక్కడి నుంచి ఎంత అప్పు చేసిందనే వివరాలు ఉంటాయి. ఆ వివరాలు తెలి యకుండా ఉండాలని ప్రజా రుణం జీఎస్డీపీలో శాతం పేరుతో గ్రాఫిక్తో సరిపుచ్చింది. అయినా కూటమి సర్కార్ గ్రాఫిక్ ప్రకారం చూసినా 2023-24 నాటికి అప్పులు 4.91 లక్షల కోట్లు ఉండగా, 2025-26 నాటికి ఆ మొత్తం రూ.6.40 లక్షల కోట్లకు చేరుతున్నట్లు వెల్లడైంది. అంటే కూటమి సర్కారు రెండేళ్లలోనే రూ.1.49 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
బడ్జెట్ అంచనాల్లో కోత
మరో పక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరిం చిన అంచనాల్లో అప్పుల లెక్కలను కూడా పొంతన లేకుండా పేర్కొంది. జనవరి నాటికే మార్కెట్ అప్పులు రూ.83,102 కోట్లు చేసినట్లు కాగ్ నెలవారీ గణాంకాలు స్పష్టం చేయగా, ఆ ర్దిక మంత్రి ప్రస్తుత ఆర్థిక ఏడాదికి సవరించిన అంచనా మార్కెట్ రుణాల అప్పు రూ.78,608 కోట్లుగా చెప్పడం గమనార్హం. వాస్తవంగా జన వరి వరకు కాగ్ చెప్పిన లెక్కలతో పాటు ఫిబ్రవ రిలో చేసిన మార్కెట్ రుణాలతో ఇప్పటికే బడ్జెట్ అప్పులే రూ.89,940 కోట్లకు చేరాయి. వాస్తవా లు ఇలా ఉంటే సవరించిన అంచనాల్లో పాంతన లేని గణాంకాలను ఆర్థిక మంత్రి చూపెట్టారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన బడ్జెట్ అంచ నాల్లో రూ.20 వేల కోట్లు కోత పెట్టారు. రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ను సవరించిన అం చనాల్లో రూ.2.74 లక్షల కోట్లకు తగ్గించేశారు.
మూల ధన వ్యయంలోనూ కోత
బడ్జెట్లో రూ.32,712 కోట్లు మూల ధన వ్య యం చేస్తామని చెప్పారు. ఇప్పుడు సవరించిన అంచనాల్లో దానిని రూ.24,072 కోట్లకు తగ్గించే శారు. జనవరి వరకు కాగ్ నెల వారీ గణాంకాల్లో మూల ధన వ్యయం రూ.10,853 కోట్లుగా పేర్కొన్నారు. 2 నెలల్లోనే రూ.14 వేల కోట్లు వ్యయం చేస్తామని సవరించిన అంచనాల్లో పేర్కొనడం నమ్మశక్యంగా లేదని ఆర్థిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 2028- 2023-24లో వ్యవసాయ రంగానికి రూ.10.214 కోట్లు వ్యయం చేస్తే, కూటమి ప్రభుత్వం 2024-25లో రూ.12,534 కోట్లు కేటాయింపులు చేసి, ఇప్పుడు సవరించిన అంచనాల్లో సగం మేర రూ.6,150 కోట్లు కోత విధించింది. గ్రామీణాభి వ`ద్ధికి 2023-24లో రూ.15,463 కోట్లు వ్యయం చేశారు. కూటమి ప్రభుత్వం 2024-25లో ఈ రంగా నికి బడ్జెట్లో రూ.17,438 కోట్లు కేటాయించి సవరించిన అంచనాల్లో రూ.12,896 కోట్లకు తగ్గించేసింది.
నమ్మించి నయ వంచన!
ఆచరణ సాధ్యం కాని హామీలతో అందలమెక్కిన టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే అన్నదాతలకు మొండి చేయి చూపింది. ‘ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటున్నారు. రైతులకు జగన్ కేవలం రూ.7,500 చొప్పునే ఇస్తున్నారు. మిగతా ఆరు వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే తొలి ఏడాది నుంచే ప్రతి రైతుకు మేమే రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ ప్రజాగళంలో చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. తీరా ఆచరణకు వచ్చేసరికి అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు.
రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ.. వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం నాలుగు శాతం మాత్రమే కావడం గమనార్హం. రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం రూ.12,401 కోట్లు కేటాయించడం పట్ల రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది నవంబర్లో ప్రవేశపెట్టిన తొలి ఏడాది బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి మొక్కుబడిగా రూ.1,000 కోట్లు కేటాయించారు.
ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు మార్కెట్లో ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో కొంత ఊరటనిస్తుందని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా తొలి ఏడాదికి సంబంధించి పైసా పెట్టుబడి సాయం విదిల్చ లేదు. వాస్తవానికి రాష్ట్రంలో రైతు భరోసా లబ్ధిదారులు 53,58,368 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జమ చేయాలంటే బడ్జెట్లో రూ.10,717 కోట్లు కేటాయించాలి.
కానీ కేటాయించింది కేవలం రూ.6,300 కోట్లే. ఈ మొత్తం రూ 20 వేల చొప్పున అర్హులైన రైతులకు చెల్లిస్తే కేవలం 31.50 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. అంటే వాస్తవ లబ్ధిదారుల్లో 22.08 లక్షల మందికి పెట్టుబడి సాయం అందదు. మరో పక్క కౌలు రైతులకు తామే పూర్తిగా పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పెట్టుబడి సాయంలో ఇలా రూ.4,417 కోట్ల మేర కోత పెట్టడం పట్ల రైతాంగం నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.
ఆర్ఎస్కేలు, అగ్రి ల్యాబ్ల నిర్వహణకు కేటాయింపులు నిల్
ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల నిర్వహణకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆర్బీకేలను కుదించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అగ్రి ల్యాబ్లను పీ–4 పద్దతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. అందువల్లే వీటి నిర్వహణకు కేటాయింపులు జరపలేదనే వాదన వినిపిస్తోంది. ధరల స్థిరీకరణ నిధికి వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం రూ.300 కోట్లు విదిల్చింది.
విపత్తుల బారిన పడి పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద గత జగన్ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో పైసా కూడా కేటాయించ లేదు. విత్తన రాయితీ పథకానికి గతేడాది రూ.268 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది పెంచకపోగా రూ.240 కోట్లకు కుదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు పశువుల మేత కోసం బంజరు భూముల కేటాయింపు కోసం నిధులు, గోపాల మిత్రల పునర్నియామకం ఊసే లేదు.
రాయితీపై సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించలేదు. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీ ప్రస్తావన లేదు. పట్టు పరిశ్రమకు 2023–24 బడ్జెట్తో పోల్చితే భారీగా కోత పెట్టింది. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి, స్వచ్ఛంద బీమా నమోదు పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి రూ.1,023 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా కోసం ఏటా రూ.1,700 కోట్లు కేటాయించారు.
అలాగే వడ్డీ లేని పంట రుణాల కోసం వైఎస్ జగన్ సర్కారు హయాంలో ఏటా రూ.500 కోట్లు కేటాయించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని సగానికి సగం తగ్గించింది. కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించడం వల్ల ఖరీఫ్ 2024–25 లో 69.51 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ పొందగా, స్వచ్ఛంద బీమా నమోదు పథకాన్ని అమలు చేయడంతో రబీ 2024–25 సీజన్లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్ పొందగలిగారు. గడిచిన రబీ సీజన్తో పోల్చుకుంటే మూడో వంతు రైతులకు కూడా రక్షణ లేకుండా పోయింది.
పాత లబ్దిదారులకే వేట నిషేధ భృతి
గద్దెనెక్కగానే వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2024–25 సీజన్కు 1,30,128 మంది అర్హత పొందగా, వారికి రూ.260.26 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాని ఏడాది గడిచినా పైసా విదల్చలేదు. అనర్హులున్నారంటూ రీ సర్వే పేరిట అర్హులను తొలగించి, తమ పార్టీ సానుభూతిపరులను చేర్చి 1,22,968 మంది అర్హత పొందినట్టుగా లెక్క తేల్చారు.
వారికి రూ.245.94 కోట్లు జమ చేయాలని ప్రతిపాదనలు పంపారు. అదే విషయాన్ని బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ 2025–26 సీజన్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు నిషేధ భృతి కోసం కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఆక్వా, నాన్ ఆక్వాజోన్తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
అర్హత కలిగిన 68,134 ఆక్వా కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ విస్తరిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ మేరకు కేటాయింపులు జరపలేదు. ఎప్పటిలోగా అమలు చేస్తామన్న స్పష్టతా ఇవ్వలేదు. మరో వైపు ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్స్, సబ్సిడీపై ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం వంటి హామీలపై పైసా కేటాయింపు జరపక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు.
మత్స్య యూనివర్సిటీకి మొండి చేయి
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంతో పాటు వైఎస్సార్ ఉద్యాన, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు అరకొరగానే కేటాయింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే కేటాయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో భవన నిర్మాణాలకు ప్రతిపాదించారు.
రూ.100 కోట్లతో పరిపాలన భవనం, అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణా కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వర్సిటీకి గతేడాది పైసా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది పైసా కేటాయింపులు జరపలేదు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ జెట్టీల నిర్మాణానికి సైతం పైసా కేటాయించలేదు. దీంతో వీటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
ఫార్మర్ అండ్ అగ్రిటెక్కు ప్రాధాన్యం
‘వ్యవసాయ అనుబంధ రంగాలే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్లు.. వీటిలో ఏటా 15 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 11 వ్యవసాయ, ఉద్యాన పంటలను గుర్తించి వాటి దిగుబడులతో పాటు ప్రకృతి సాగు విస్తీర్ణం పెంచడం లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాం. ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనే సూత్రంతో స్వర్ణాంధ్ర-2047 సాధన దిశగా ముందుకెళ్తున్నాం’ అని వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.48,341.14 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్ను అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టారు.
22.86 శాతం వృద్ధిరేటు సాధించాం
2024-25లో ఏపీ జీఎస్డీపీ మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయ జీఏవీ రూ.57,187 కోట్లు (22.86 శాతం)గా నమోదైందని మంత్రి చెప్పారు. 2024-25లో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద రూ.13.09 కోట్ల ఖర్చుతో 4.30 లక్షల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించామన్నారు. 2025-26లో 6 లక్షల పత్రాలను ఇస్తామన్నారు.
“వెట్ కెమిస్ట్రీ స్థానంలో డ్రై కెమిస్ట్రీ పద్ధతి అమలులోకి తెస్తున్నాం. 2025-26లో 5.98 లక్షల హెక్టార్లలో రైతులకు రాయితీపై సూక్ష్మ పోషకాల పంపిణీ చేస్తాం. రాష్ట్రానికి అవసరమైన 41.38 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేస్తున్నాం. 2 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఏర్పాటు చేస్తున్నాం. గ్యాప్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా 4.76 లక్షల హెక్టార్లలో 10.38 లక్షల మంది రైతులకు ధ్రువీకరణ చేస్తున్నాం. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం కింద 3 వేల కొత్త పంచా యతీల్లో 2570 క్లస్టర్ల పరిధిలో ప్రకృతి సాగును విస్తరి స్తున్నాం. ఈ పథకం కింద 15 లక్షల రైతు కుటుంబాలతో రూ.6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు విస్తరిస్తాం.ఈ ఏడాది 50 శాతం రాయితీపై చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాలతో పాటు 80 శాతం రాయితీపై 875 కిసాన్ డ్రోన్స్ ఏర్పాటు చేస్తున్నాం. 2025-26లో మరో వెయ్యి డ్రోన్లు అందిస్తాం” అని మంత్రి చెప్పారు.
ఏపీ టూరిజం అథారిటికీ రూ.171 కోట్లు కేటాయింపు
దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలపుతానన్న సీఎం చంద్రబాబు మాటలు ఒట్టి కోతలని తేలిపోయింది. 2025–26 బడ్జెట్లో ఏపీ పర్యాటక అభివృద్ధి కంటే తాత్కాలిక ఈవెంట్ల నిర్వహణకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టమైంది. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖకు మొత్తంగా రూ.460 కోట్లు కేటాయించారు. ఇందులో పర్యాటక శాఖలో తమ అనుయాయుల కంపెనీలకు ఈవెంట్, ఫంక్షన్ కాంట్రాక్టులు దక్కేలా చేసి, వారికి లబ్ధి చేకూర్చేలా ఏపీ టూరిజం అథారిటీకి రూ.171 కోట్లు కేటాయించగా.. అందులో రూ.150 కోట్లు ఒక్క ఈవెంట్ల నిర్వహణకే ఇవ్వడం గమనార్హం.
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)ను నిర్లక్ష్యం చేసింది. సంస్థ స్వయం సమృద్ధి సాధించడం ద్వారా సింహ భాగం ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులను ఏపీటీడీసీ ఆదాయం నుంచే భరించేది. ప్రభుత్వం నుంచి ఏటా సుమారు రూ.2.50 కోట్ల వరకు కేటాయింపులుండేవి. కానీ, ఈ బడ్జెట్లో వాటిని రూ.64 లక్షలకు కుదించేసింది. తద్వారా ఏపీటీడీసీపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. ఏపీటీడీసీలో అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు జీతాల కింద నెలకు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుంది.
రెగ్యులర్ ఉద్యోగులకు రూ.50–60 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించే మొత్తం సుమారు ఐదారు నెలల వరకు రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు వీలుగా ఉండేది. ఇప్పుడు నిధులు తగ్గడంతో ఏపీటీడీసీపై ఆర్థిక భారం పెరగనుంది. ఇక 40 కొత్త పర్యాటక ప్రాజెక్టుల కోసమని రూ.50 కోట్లు కేటాయించారు. అంటే ఒక్కో ప్రాజెక్ట్ ఆధునికీకరణకు రూ.కోటికి మించి కేటాయించలేని దుస్థితి.
ఇలా పర్యాటక శాఖ, భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్, శిల్పారామం సొసైటీకి కలిపి రూ.230 కోట్లు కేటాయింపులు చేసింది. క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ, కల్చరల్ కమిషన్కు కలిపి మరో రూ.230 కోట్ల వరకు కేటాయింపులు ప్రతిపాదించింది.
ప్రజల భద్రతపైనా చిన్నచూపు
రాష్ట్రంలో శాంతి-భద్రతల పరిరక్షణపై సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నా.. అడుగులు గడప దాటడం లేదని 2025-26 వార్షిక బడ్జెట్ మరోసారి వెల్లడించింది. హోమ్ మం త్రిత్వ శాఖకు ప్రభుత్వం కేవలం రూ.8,570 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ అందులో అత్యధికంగా పోలీస్ శాఖ జీతభత్యా లకే సరిపోతుంది. పోలీస్ శాఖ ఆధునికీ కరణ, మౌలిక వసతుల కల్పన తదితర వాటికి అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. ఆ కేటాయింపుల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి..
- మహిళా భద్రతకు కేవలం రూ.13.64 కోట్లు
- పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణకు కేవలం రూ.కోటి
- క్రైమ్-క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం కోసం రూ. 12 కోట్లు
- ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు రూ.47.97 కోట్లు
- పోలీస్ భవనాల నిర్మాణానికి రూ.60 కోట్లు
- జైళ్ల నిర్మాణానికి రూ.40 లక్షలు
- పోలీసు బలగాల ఆధునికీకరణకు కేవలం రూ.10.44 కోట్లు
- అగ్నిమాపక శాఖ భవనాలు, ఆధునికీకరణకు (ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది) రూ.64 కోట్లు
- ఏపీ పోలీస్ అకాడమీకి రూ.11.20 కోట్లు
చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు రూ.11,000 కోట్లు
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టిసారించాం.. ఇక నుంచి ఏ ఏడాది పారిశ్రామిక రాయితీలు ఆ ఏడాదే విడుదల చేస్తాం. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించడం కోసం ఒక ఎస్క్రో ఖాతా తెరిచి అందులో ప్రోత్సాహక నిధులు వేస్తాం’.. అని సీఎం చంద్రబాబునాయుడు పారిశ్రామిక పాలసీల విడుదల సందర్భంగా ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ, ఈ మాటలు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ విన్నట్లు, చూసినట్లు లేరు.
ఎందుకంటే.. సీఎం చెప్పిన మాటలకు, బడ్జెట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు చేసిన కేటాయింపులకు ఎక్కడా పొంతనలేదు. 2025–26 బడ్జెట్లో స్పీడ్ ఆఫ్ బిజినెస్లో భాగంగా ప్రోత్సాహకాల కోసం ఎటువంటి కార్పస్ ఫండ్ను ఏర్పాటుచేయలేదు. పైగా.. చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు రూ.11,000 కోట్లు ఉన్నాయని స్వయంగా బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థికమంత్రి దానికి అనుగుణంగా కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద మొక్కుబడిగా రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించడంపై పారిశ్రామికవేత్తలు రగిలిపోతున్నారు.
గత బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోత..
ఇక 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పరిశ్రమల రంగానికి బడ్జెట్లో రూ.2,270.78 కోట్లు కేటాయిస్తే సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.822.81 కోట్లకు తగ్గించేశారంటే పారిశ్రామిక రంగంపై కూటమి సర్కారుకున్న ప్రాధాన్యత స్పష్టమైంది. అలాగే, వచ్చే ఆర్థిక సంవత్సరానికీ రూ.2,418.57 కోట్లు కేటాయించారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.1,000.24 కోట్లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సహకానికి రూ.200 కోట్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.200 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్కు రూ.75 కోట్లు, ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగంలో రూ.3,000 కోట్లు కేటాయించారు. కడప స్టీల్ ప్లాంట్కు గత బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయించగా ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చే సంవత్సరానికి రూ.25 కోట్లు కేటాయించారు.
పోర్టులు, ఎయిర్పోర్టుల వద్ద స్థల సేకరణపై దృష్టి..
ఇదిలా ఉంటే.. మచిలీపట్నం పోర్టు వద్ద 10,070 ఎకరాల సేకరణకు రూ.150 కోట్లు, భావనపాడు (మూలపేట) పోర్టు వద్ద 6,410 ఎకరాలు సేకరించడానికి రూ.100 కోట్లు, రామాయపట్నం పోర్టు వద్ద 506 ఎకరాల సేకరణకు రూ.100 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే..
- భోగాపురం ఎయిర్పోర్టు వద్ద 40 ఎకరాల భూసేకరణతో పాటు రహదారులు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.190 కోట్లు కేటాయించారు.
- అదే విధంగా కుప్పం ఎయిర్పోర్టు నిర్మాణానికి 444 ఎకరాలు, దగదర్తి ఎయిర్పోర్టు వద్ద 418 ఎకరాల సేకరణకు రూ.30 కోట్లు కేటాయించారు.
- విజయవాడ ఎయిర్పోర్టుకు రూ.29.88 కోట్లు, కర్నూలు ఎయిర్పోర్టు నిర్వహణకు రూ.15.29 కోట్లు, వీజీఎఫ్ కింద విమాన సర్వీసులు నిర్వహించడానికి రూ.30 కోట్లు కేటాయించారు.
- ఇక విశాఖ–చెన్నై కారిడార్లో భాగంగా ఏడీబీ నిధులతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నామమాత్రపు కేటాయింపులు చేశారు.
- ఐటీ రంగానికి రూ.533.72 కోట్లు, నైపుణ్య శిక్షణకు రూ.462.68 కోట్లు కేటాయించారు.
వలంటీర్ల వ్యవస్థకు మంగళం!
రాష్ట్రంలో పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా ఐదేళ్ల పాటు లబ్దిదారుల ఇళ్ల వద్దనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న వలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. గత ఏడాది ఎన్నికల ముందు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వారి గౌరవ వేతనం రెట్టింపు చేస్తామని ఊరూవాడా హోరెత్తించిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను చిదిమేశారు. తాజాగా.. ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ నిధులు కేటాయించకపోవడంతో 2.66 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలు రోడ్డునపడినట్లయింది.
నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి..
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు విజయవంతంగా కొనసాగిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఉపాధి పొందారు. అప్పట్లో 20–25 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 శాతం మంది, 26–30 ఏళ్ల మధ్య వారు 36 శాతం, 31–35 ఏళ్ల మధ్య వారు 28 శాతం కలిపి మొత్తం 91 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ‘వలంటీర్’గా ఉపాధి పొందారు.
మరోవైపు.. వలంటీర్లుగా అప్పటి ప్రభుత్వం నియమించిన వారిలో 49 శాతం మంది బీసీలు, 27 శాతం మంది ఎస్సీలు, ఏడు శాతం మంది ఎస్టీలున్నారు. అలాగే, మొత్తం మీద 1,25,781 మంది మహిళలు ఉపాధి పొందారు.
తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్నా..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వలంటీర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు గత ఏడాది ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున.. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఊదరగొట్టారు. అయితే, జూన్లో అధికారంలోకి వచ్చాక ఆ నెల నుంచి వలంటీర్ల వేతనాలను ప్రభుత్వం నిలిపివేసింది.
అంతేకాక.. అప్పటివరకూ అన్ని రకాల విధులు నిర్వహించిన వీరిని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో వలంటీర్లు చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తునే ఉన్నారు. అయినా, ఈ సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదు.
పీపీపీ విధానంలో రోడ్ల నిర్మాణం
రాష్ట్ర, జిల్లా రహదారులపైనా టోల్ ఫీజుల బాదుడుకు రంగం సిద్ధమైంది. ఇక రోడ్డు ఎక్కితే వాహనదారులకు ‘బోల్’ బాధ తప్పదు. ఇప్పటికే పలు రాష్ట్ర, జిల్లా ప్రధాన రహ దారులను పీపీపీ విధానంలో నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. బడ్జెట్లో కేటాయింపుల ద్వారా మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
టీడీపీ ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో ఆర్ అండ్ బీ శాఖకు రూ.9,554 కోట్లు కేటాయించగా.. 2025-26 వార్షిక బడ్జెట్లో మాత్రం రూ.8,785 కోట్లే కేటాయించింది. అందులో రోడ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపులను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వ కనికట్టు బట్టబయలైంది. కీలకమైన గ్రామీణ రహదారులు, గోదావరిపై వంతెన నిర్మాణం.. కడప యాన్యూటీ పనులకు గత ప్రభుత్వం కేటాయించిన నిధుల కంటే బాబు సర్కార్ అతి తక్కువ నిధులు కేటాయించింది.
- రైల్వే పనులకు సంబందించిన రోడ్లు, వంతెనల నిర్మాణం, రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులు, ఇతర రహదారులు, రహదారి భద్రత పనులు, తుంగభద్ర పుష్కర పనులు తదితరాలకు కలిపి ప్రభుత్వం కేవలం రూ.1,183 కోట్లే కేటాయించింది.
- ఆరఏడీ కింద మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి నిధులు, ఎన్డీబీ బ్యాంకు రుణ సహాయం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, గ్రామీణ రోడ్లు, ఎన్ఆర్ఈజీపీ నిధులతో రోడ్ల నిర్మాణం కోసం రూ.820.36 కోట్లే కేటాయించింది. వీటి కి గత ప్రభుత్వం 2023-24లో రూ.1,481.59 కోట్లు కేటాయించడం గమనార్హం.
- గోదావరిపై వంతెన నిర్మాణం, కడప యాన్యుటీ పనులు, రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్మాణ పనులకు రూ.1,040 కోట్లే కేటాయించింది.
సాగు నీటి ప్రాజెక్టులకు..
వ్యవసాయాన్ని పండుగ చేసే.. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బడ్జెట్ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో చేపడతామని చెప్పిన సీఎం చంద్రబాబు.. కనీసం వాటినైనా గడువులోగా పూర్తి చేయడానికి సరిపడా నిధులను బడ్జెట్లో ఇవ్వకపోవడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో జలవనరుల శాఖకు రూ.18,019.66 కోట్లు (భారీ నీటి పారుదలకు రూ.17,142.06 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.877.60 కోట్లు) కేటాయించారు.
ఇందులో రూ.15,576 కోట్లను సాగునీటి ప్రాజెక్టుల పనులకు (కేపిటల్ వ్యయం) ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. పోలవరానికి కేటాయించిన రూ.5,756.82 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కాగా, 2024–25 బడ్జెట్లో ప్రాజెక్టులకు రూ.16,705.32 కోట్లు (భారీ నీటి పారుదలకు రూ.15,483.35 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.1,221.97 కోట్లు) కేటాయించారు.
అయితే, సవరించిన బడ్జెట్లో రూ.5,906.76 కోట్లు కోత పెట్టి రూ.10,798.56 కోట్లు కేటాయించినట్లు ప్రస్తుత బడ్జెట్లో స్పష్టం చేశారు. అంటే.. గత బడ్జెట్ నిధుల్లో 35.36 శాతం కోత విధించినట్లు స్పష్టమవుతోంది. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం కేటాయించిన నిధులను కూడా ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో విడుదల చేయడం అనుమానమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
ప్రణాళికా రాహిత్యానికి పరాకాష్ట..
➣ ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామన్న ప్రభుత్వం.. తొలి దశలో పోలవరం, హంద్రీ–నీవా, వెలిగొండ, చింతలపూడి, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, గోదా వరి–పెన్నా తొలి దశను చేపడతామంది. చింతలపూడి ఎత్తిపోతల, గోదావరి–పెన్నా తొలి దశను 2026, జూన్ నాటికి, పోలవరం ప్రాజెక్టును 2027 జూన్కు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో గత ప్రభుత్వమే పోలవరాన్ని కొలిక్కితెచ్చింది. వెలిగొండ తొలి దశ, హంద్రీ–నీవా, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం దాదాపుగా పూర్తి చేసింది.
➣ రూ.1,400 కోట్లు ఖర్చు చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒకటో టన్నెల్ ద్వారా కృష్ణా జలాలను గత సెప్టెంబరు–అక్టోబరు నాటికే తరలించే అవకాశం ఉండేది. ఈ ప్రాజెక్టు పనులకు గత బడ్జెట్లో 393.49 కోట్లను కేటాయించిన సర్కార్.. అందులో కోత వేసి రూ.300.52 కోట్లతో సరిపెట్టింది.
➣ కనీసం ఆ నిధులను కూడా ఖర్చు చేయలేదు. తాజాగా 309.13 కోట్లు కేటాయించింది. తొలి దశ పూర్తి కావాలంటే రూ.1,458 కోట్లు, రెండో దశకు రూ.2,180 కోట్లు అవసరం. దీన్నిబట్టి చూస్తే ఆ ప్రాజెక్టు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యే అవకాశం లేదు.
➣ ఒడిశాతో వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. గొట్టా బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార స్టేజ్–2లో అంతర్భాగమైన హిర మండలం రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసేలా వంశధార ఎత్తిపోతలను గత ప్రభుత్వం చేపట్టింది. ఇది పూర్తయితే వంశధార ఆయకట్టు రైతులకు పూర్తి ఫలాలను అందించవచ్చు. వంశధార–నాగావళి అనుసంధానం పనులను దాదాపు పూర్తి చేసింది. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేసి ఖర్చు చేస్తే.. జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంది.
➣ చింతలపూడి ఎత్తిపోతల పూర్తికి రూ.2043.38 కోట్లు అవసరం. 2026 జూన్ నాటికి నీళ్లందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. గత బడ్జెట్లో ఈ ఎత్తిపోతలకు రూ.150 కోట్లు చూపినా చివరకు రూ.3.08 కోట్లతో సరిపెట్టారు. ఇప్పుడు కేవలం రూ.30 కోట్లు కేటాయించింది. ఆ ఎత్తిపోతల ఎలా పూర్తవుతుందన్నది సర్కారుకే తెలియాలి.
➣ 2026 జూన్ టార్గెట్గా పెట్టుకున్న గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ పూర్తి కావాలంటే రూ.5,372.31 కోట్లు అవసరం. గత బడ్జెట్లో పైసా కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో ఎలా పూర్తవుతుందన్నది ప్రభుత్వమే చెప్పాలి.
➣ హంద్రీ–నీవా సుజల స్రవంతిలో డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి 2026 జూన్కు నీళ్లందిస్తామని గొప్పలు చెప్పింది. కానీ.. హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ గత ప్రభుత్వం చేపట్టిన పనులను.. 3,850 క్యూసెక్కులకు కుదించింది. రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూర్ బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తున్నా వెనక్కుతగ్గకుండా పూర్తి చేసేందుకే మొగ్గుచూపింది. డిస్ట్రిబ్యూటరీల పనులకు నిధులు కేటాయించని నేపథ్యంలో ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమే.
➣ ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులకే నిధుల కేటాయింపు ఇలా ఉంటే.. మిగతావాటికి కేటాయింపు, విడుదల ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
➣ కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందించడానికి వీలుగా కాలువల మరమ్మతులు, డ్రెయిన్లలో పూడికతీత పనులకు అవసరమైన మేరకు నిధులు ఇవ్వకపోవడం గమనార్హం.
➣ పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా కాకుండా.. 41.15 మీటర్ల ఎత్తు వరకే 119.40 టీఎంసీలు నిల్వ చేసేలా 2026 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157 కోట్లు ఇస్తామని కేంద్రం పెట్టిన షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు కేంద్రం గత, ప్రస్తుత బడ్జెట్లలో నిధులిచ్చింది. కానీ.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తే పూర్తి ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యం కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీళ్లందించే అవకాశం ఉంటుంది.
మౌలిక సదుపాయాలు ‘కల్పనే’
రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వ డొల్లతనం 2025–26 బడ్జెట్ సాక్షిగా నిరూపితమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాలు అమృత్ 2.0, స్వచ్ఛ భారత్.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను మాత్రమే మౌలిక వసతుల కల్పనకు కేటాయించింది.
సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అమరావతి అంటూ సీఎం చంద్రబాబు నుంచి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వరకు చెబుతున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నది మరోసారి బహిర్గతమైంది. రూ.6 వేల కోట్ల విదేశీ రుణంతో అమరావతిని అభివృద్ధి చేస్తామని బడ్జెట్లో పేర్కొనడమే అందుకు నిదర్శనం.భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించేందుకు రూ.297.87 కోట్లు కేటాయించింది.
➤ విశాఖపట్నం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. విజయవాడకు కేవలం రూ.115.11 కోట్లు కేటాయించింది.
➤ నెల్లూరు కార్పొరేషన్, సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) రుణాలు చెల్లించేందుకు రూ.1,945 కోట్లు కేటాయించడం గమనార్హం.
➤ పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు ప్రస్తుత బడెŠజ్ట్లో ప్రభుత్వం రూ.13,862.29 కోట్లు కేటాయించింది. ఇందులో అమరావతి అభివృద్ధికి తెచ్చే విదేశీ రుణం రూ.6 వేల కోట్లు.. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.2,233.41 కోట్లు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చింది రూ.5,628.88 కోట్లే అన్నది స్పష్టమవుతోంది.
ఇందులో అధిక శాతం ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణకే వ్యయం చేయాల్సి ఉంటుంది. అమరావతి సహా పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన (కేపిటల్ వ్యయం) కోసం రూ.7049.54 కోట్లు ఖర్చు చేస్తుండడం గమనార్హం.
రుణాలతోనే రాజధాని నిర్మాణం
అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధులను తానే సమకూర్చుకుంటుందని.. అందుకే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్ అని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి తెచ్చిన రుణాల చెల్లింపునకు ఈ బడ్జెట్లో రూ.836 కోట్లు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు కింద ఇచ్చేందుకు రూ.297.82 కోట్లు కేటాయించారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్ల విదేశీ రుణాన్ని కేటాయించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే రాజధానికే రూ.7,133.82 కోట్లు కేటాయించినట్లు స్పష్టమవుతోంది.
కేంద్ర ప్రాయోజిత పథకాలే దిక్కు..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులే దిక్కయ్యాయి. అమృత్ 2.0 కింద కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర వాటా జత చేసి రూ.751.72 కోట్లతో మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల, వరద కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు.
స్వచ్ఛభారత్ కింద వచ్చే 1031.25 కోట్లతో నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని బడ్జెట్లో పేర్కొంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రూ.450.44 కోట్లు వస్తాయని అంచనా వేసిన ప్రభుత్వం.. వాటిని మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించింది.
నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా వివిధ అభివృద్ధి పనులు చేపట్టినందుకు తెచ్చిన రుణాన్ని చెల్లించేందుకు రూ.150.87 కోట్లు, ఏపీ టిడ్కో రుణాలు చెల్లింపునకు రూ.1109 కోట్లు కేటాయించింది.
విద్యుత్ వెలుగులు లేవు!
విద్యుత్ రంగానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించకుండా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి చేతులెత్తేసింది. ఓటాన్ బడ్జెట్లోనే ఇంధన శాఖకు అరకొరగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. వార్షిక బడ్జెట్లోనూ మొండి చేయి చూపించింది. రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసి బిల్లులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఇంధన రంగానికి, రాయితీలు, సబ్సిడీల కోసం బడ్జెట్లో కేవలం రూ.13,600 కోట్లే కేటాయించింది.
కనీసం చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నంత కూడా ఇవ్వలేకపోయింది. విద్యుత్ రంగం రూ.1.29 లక్షల కోట్లకు పైగా నష్టాల్లో ఉందన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఆ అప్పులను తీర్చేందుకు ఒక్క రూపాయి కూడా సాయంగా ప్రకటించలేదు. పైగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిoదని.. అందుకే ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
నిజానికి గత టీడీపీ హయాంలో జరిగిన అనవసర అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల వల్లే.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయనే వాస్తవాన్ని మంత్రి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం–2024 ద్వారా పునరుత్పాదక ఇంధన తయారీ జోన్లను ఏర్పాటు చేసి, పెట్టుబడులను ఆకర్షించి 7.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
అయితే ఇప్పటివరకూ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో, ఈ రంగంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో మంత్రి చెప్పలేకపోయారు. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఇంధన రంగానికి సంబంధించి ఇచ్చిన హామీలకు బడ్జెట్లో అస్సలు స్థానమే లభించలేదు. రైతులకు సబ్సిడీపై పంపుసెట్లు మంజూరు చేస్తామనే హామీ అమలు గురించి ఎక్కడా కనిపించలేదు.
భవిష్యత్లో పెరగనున్న విద్యుత్ డిమాండ్ను అందుకోవడం కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇక ఇంధన పొదుపు, సంరక్షణ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం కేంద్ర పథకాలైన పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలకు వచ్చే సబ్సిడీలతోనే సోలార్ రూఫ్ టాప్, సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని చెబుతోంది.
పేదల ఇళ్లకు పాతర..
పేదల ఇళ్ల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం పాతరేసింది. వైఎస్సార్సీపీ హయాంలో 2023–24లో ఏకంగా రూ.6,866 కోట్లు కేటాయించి వ్యయం చేయగా.. కూటమి సర్కారు 2024–25 పేదల రూ.4,012 కోట్లు కేటాయించి కేవలం రూ.1,611 కోట్లే వ్యయం చేసినట్లు సవరించిన అంచనాల్లో పేర్కొంది. ఇక 2025–26లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,317 కోట్లు ప్రతిపాదించింది.
ప్రధానమైన ఆక్షేపాలు
హామీలు పూర్తిగా తప్పించుకోవడం: నిరుద్యోగ భృతి, మహిళా సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమం, అన్నదాతా సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలపై నిధుల తగ్గింపు, కేటాయింపులు చేయకపోవడం.
రైతులకు సాయం లేకపోవడం: రైతులకు ఇచ్చే సాయం కేవలం చిట్టీ పైన మాత్రమే ఉండి, పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన నిధుల వాడకం సరిపోకుండా తగ్గించడం.
సామాన్య ప్రజలకు మోసాలు: నిరుద్యోగుల, మహిళల, రైతుల ప్రాధాన్యతలను వదిలి వెళ్లడం, అసలు అమలుకు సంబంధించి స్పష్టత లేకుండా పథకాలను వాయిదా వేయడం.
పేదల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం: పేదల ఇళ్ల నిర్మాణాలకు నిధుల వాడకం, పథకాలు మరింత క్రమంలో ప్రస్తుతికరించకుండా ఉంటూ సగటు ప్రజలకు మేలు కాకుండా పోవడం.
విభాగాలపై కేటాయింపులు: వివిధ సంక్షేమ పథకాలకు తగ్గింపు, కొత్త ఆర్థిక ప్రణాళికలు, ఉద్యోగుల వేతన పెంపు, సామాన్య ప్రజలకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం.