ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2025: సామాన్యులకు శుభవార్త. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి తగ్గింది. సెప్టెంబర్ నెలలో 1.54 శాతంగా నమోదు కాగా.. ఇది 8 సంవత్సరాల కనిష్టం కావడం విశేషం. చివరిగా 2017 జూన్ నెలలో 1.46 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చింది. ఇటీవల ఆగస్టులో అంతకుముందుతో పోలిస్తే చాలా పెరిగింది. మళ్లీ దిగిరావడం సానుకూలాంశం అని చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఫుడ్ ప్రైసెస్ తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగొస్తుంది.

>> గత నెలలో అంటే ఆగస్టులో కూడా 2.07 శాతంగా ఉంది. ఇది 2 నెలల స్థాయి. అక్కడి నుంచి విశేషంగా తగ్గి.. సామాన్యులకు ఊరట కల్పించిందని చెప్పొచ్చు. గత కొంత కాలంగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గితే.. వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే.. వస్తువుల ధరలు తగ్గితే కూడా ద్రవ్యోల్బణం దిగొస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో.. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం భారీగా తగ్గిందని ఎన్ఎస్ఓ విడుదల చేసింది.
ఇప్పుడు ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన పరిమితి కంటే చాలా తక్కువగా నమోదు కావడం మరో విశేషం. ఆర్బీఐ 4 ప్లస్ లేదా మైనస్ 2 గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 2-6 శాతం మధ్య ఉండొచ్చన్నమాట. కానీ ఇప్పుడు ఆర్బీఐ టార్గెట్ అయిన 2 కంటే తక్కువ స్థాయి చేరడం గొప్ప విషయం.
ధరల సూచీలో దాదాపు సగం వాటా ఉండే ఆహార ద్రవ్యోల్బణం (ఫుడ్ ఇన్ప్లేషన్) గత నెలలో – 0.69 శాతంగా ఉండగా.. ఇప్పుడు – 2.28 శాతం తగ్గింది. ఇంకా కూరగాయలు, పప్పు ధాన్యాలు గుడ్లు, నూనెలు, తృణ ధాన్యాలు, ఇంధన ధరలు, పండ్లు తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగొచ్చిందని ఎన్ఎస్ఓ ప్రకటించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేటు 1.07 శాతంగా ఉండగా.. పట్టణ ప్రాంతాలు ఎక్కువగా 2.04 శాతంగా ఉన్నాయి. అత్యధికంగా కేరళలో ద్రవ్యోల్బణం 9.05 శాతంగా ఉండగా.. ఇది ఉత్తర ప్రదేశ్లో అత్యల్పంగా 0.61 శాతంగా ఉండటం విశేషం. ఇక ఆర్బీఐ ఈ ద్రవ్యోల్బణం లెక్కల్ని తీసుకుంటే కీలక రెపో రేట్లను తగ్గిస్తుందని చెప్పొచ్చు. కిందటి సమీక్షలో వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంచబడ్డాయి.. ఈసారి డిసెంబరులో మళ్లీ తగ్గించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
