
హైదరాబాద్: కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రిషద్ అనే వ్యక్తి వచ్చాడు. అతడిని దుండగులు వెంబడించి.. కాల్పులు జరిపారు. రూ. 6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఘటనలో రిషద్ కాలికి తూటా గాయమైంది. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. ఘటనాస్థలిలో సీసీటీవీ ఫుటేజీని సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. బైకుపై వచ్చిన ఇద్దరు దుండుగులు కాల్పులు జరిపి డబ్బు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు రిషద్ను నాంపల్లిలోని వస్త్ర వ్యాపారిగా గుర్తించారు.
ఘటనాస్థలిని డీసీసీ శిల్పవల్లి పరిశీలించారు. క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించినట్లు తెలిపారు. ‘‘ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య ఘటన జరిగినట్లు మాకు సమాచారం అందింది. కాల్పులు జరిగిన వెంటనే అలర్ట్ అయ్యాం. నిందితుల కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలా జరగడం దురదృష్టకరం. నిందితులు తప్పించుకోలేరు’’ అని అన్నారు.


