Jaggareddy Comments,వాడిని చెప్పుతో కొడతా.. ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. – congress leader jagga reddy condemned misinformation spread on social media against minister komatireddy


మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. అంచెలంచెలుగా ఎదిగిన కోమటిరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం దుర్మార్గమని… ఇలాంటి కుట్రల వెనుక ఉన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. తనపై వస్తున్న అసత్య వార్తలపై మంత్రి కోమటిరెడ్డి సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిని కోల్పోయి ప్రజాసేవలో ఉన్న తనకు ఇటువంటి అవమానాలు ఎదురవ్వడం బాధాకరమని.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు.

జగ్గారెడ్డి ఫైర్
మంత్రి కోమటి రెడ్డిపై చేస్తున్న ఆరోపణలపై స్పందించిన జగ్గారెడ్డి(ఫోటోలు– Samayam Telugu)
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. వ్యక్తిత్వానికి సంబంధించిన రాజకీయాలు సరికాదని.. కోమటిరెడ్డి వంటి నాయకులపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంతో కష్టంతో కూడుకున్నదని జగ్గారెడ్డి గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి అయ్యారని.. ఆయన చరిత్రపై బురద జల్లడం తగదని హెచ్చరించారు.

ఇలాంటి అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో బయటకు రావాలని ఆయన సవాలు విసిరారు. తెర వెనుక ఉండి కుట్రలు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వాడెవడో తెలిస్తే చెప్పుతో కొడతామంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా అధికారులను ఈ వివాదాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమని.. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన అభిప్రాయపడ్డారు. తనపై వస్తున్న కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని బలి చేయడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కాస్త విషం ఇచ్చి చంపేయండి: మంత్రి కోమటిరెడ్డి

తన ఏకైక కుమారుడిని కోల్పోయిన తర్వాత కూడా కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఆయన తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సేవ చేస్తున్న తనకు ఇలాంటి అవమానాలు ఎదురవ్వడం బాధాకరమని అన్నారు. ప్రస్తుత సోషల్ మీడియా వేధింపులు చూస్తుంటే.. తన కుమారుడు చనిపోయినప్పుడే రాజకీయాల నుండి తప్పుకుంటే బాగుండేదని అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడి కారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అసత్య ప్రచారాలపై ప్రభుత్వం తరఫున సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ.. కుటుంబ సభ్యులను, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.

బూరుగడ్డ వీరబాబు

రచయిత గురించిబూరుగడ్డ వీరబాబుబూరుగడ్డ వీరబాబు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయన తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, ఇన్‌ఫ్రా న్యూస్‌, పొలిటికల్ న్యూస్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వీరబాబు జర్నలిజంలో పీజీ చేస్తున్నారు.… ఇంకా చదవండి