మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. అంచెలంచెలుగా ఎదిగిన కోమటిరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం దుర్మార్గమని… ఇలాంటి కుట్రల వెనుక ఉన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. తనపై వస్తున్న అసత్య వార్తలపై మంత్రి కోమటిరెడ్డి సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిని కోల్పోయి ప్రజాసేవలో ఉన్న తనకు ఇటువంటి అవమానాలు ఎదురవ్వడం బాధాకరమని.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు.

ఇలాంటి అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో బయటకు రావాలని ఆయన సవాలు విసిరారు. తెర వెనుక ఉండి కుట్రలు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వాడెవడో తెలిస్తే చెప్పుతో కొడతామంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా అధికారులను ఈ వివాదాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమని.. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన అభిప్రాయపడ్డారు. తనపై వస్తున్న కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని బలి చేయడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కాస్త విషం ఇచ్చి చంపేయండి: మంత్రి కోమటిరెడ్డి
తన ఏకైక కుమారుడిని కోల్పోయిన తర్వాత కూడా కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఆయన తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సేవ చేస్తున్న తనకు ఇలాంటి అవమానాలు ఎదురవ్వడం బాధాకరమని అన్నారు. ప్రస్తుత సోషల్ మీడియా వేధింపులు చూస్తుంటే.. తన కుమారుడు చనిపోయినప్పుడే రాజకీయాల నుండి తప్పుకుంటే బాగుండేదని అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడి కారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అసత్య ప్రచారాలపై ప్రభుత్వం తరఫున సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ.. కుటుంబ సభ్యులను, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
