కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. తెలంగాణ నిరుద్యోగుల బాధలు పట్టించుకోరా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ట్వీట్ చేసిన కవిత.. ‘రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యింది. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ గారు మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా. మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారు. యూత్ డిక్లరేషన్ బోగస్గా మారింది.. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు.. కాంగ్రెస్ అంటేనే మోసం.. వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు. రాహుల్ జీ ఇది పోరాటాల పురిటిగడ్డ.. మీ హామీని నిలబెట్టుకోండి.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండి’ అని పేర్కొన్నారు.
ఇక పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. పార్టీ చేపట్టే కార్యక్రమాల నిర్వహణ సహా అనేక అంశాలపై హస్తం పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చలు జరిపారు. గత 9 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ట్రైనింగ్ శిబిరం కొనసాగుతోంది. ఇవాళ జరిగే ముగింపు సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు.
