ఖమ్మం జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రంగా మారబోతుంది. ఇప్పటికే భద్రాద్రి రామయ్య భక్తులకు అభయం ఇస్తుండగా.. ఇక నుంచి తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కూడా భక్తులకు దక్కనుంది. టీటీడీ ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం గ్రామంలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణం కానుంది. ఈ ఆలయ నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించింది.
హైలైట్:
- ఖమ్మం జిల్లాలో టీటీడీ శ్రీవారి ఆలయం
- 20 కేటాయించిన తెలంగాణ సర్కార్
- త్వరలోనే ఆలయ నిర్మాణం

ఖమ్మం జిల్లాలో టీటీడీ ఆలయ నిర్మాణ ఆవశ్యకతను గతంలో జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. స్వయంగా సీఎంను కలిసి జిల్లాలో భక్తుల ఆసక్తిని దృష్టిలో ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే భద్రాచలం ఆలయంలో ఖమ్మం జిల్లాలకు ప్రపంచఖ్యాతి వచ్చిందని.. తిరుమల వెళ్లలేని సామాన్య భక్తుల కోసం శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు సహకరించాలని కోరారు. తుమ్మల విజ్ఞప్తిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఖమ్మం జిల్లాకే చెందిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి భూకేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆలయ నిర్మాణానికి ఆమోదముద్ర పడింది.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయ ప్రాంగంణంలో అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా శుభకార్యాల వేదికలు నిర్మిస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కార్యక్రమాల నిర్వహణకు గాను ధార్మిక కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తారు. భక్తుల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్, గార్డెనింగ్, క్యూలైన్ల వంటివి ఏర్పాటు చేయనున్నారు. కొత్త శ్రీవారి ఆలయం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆర్థికంగానూ ఖమ్మం ముఖచిత్రాన్ని మార్చనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక హబ్గా, పర్యాటక రంగంలోనూ కొత్త పుంతలు తొక్కనుంది.
