Puducherry Cm N Rangasamy,4 సార్లు ముఖ్యమంత్రి.. బైక్‌పై ప్రయాణం, రోడ్డు పక్కన టీ.. పార్టీ పెట్టిన 48 రోజులకే అధికారంలోకి..! – పుదుచ్చేరి cm n రంగస్వామి జీవిత చరిత్ర రాజకీయ కథ ainrc పార్టీ మరియు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరిన్ని


ఆయన ఒక ముఖ్యమంత్రి. ఒకసారి కాదు ఏకంగా 4 సార్లు సీఎంగా పనిచేశారు. కానీ చాలా సాధారణ వ్యక్తిగా జీవనం సాగిస్తూ ఉంటారు. రోడ్డు పక్కన కొట్టులో స్థానికులతో కలిసి టీ తాగుతారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు, సెక్యూరిటీ లేకుండా బైక్‌పైనే ప్రయాణం చేస్తారు. పెళ్లి కూడా చేసుకోలేదు. పార్టీని పెట్టి.. కేవలం 48 రోజుల్లోనే అధికారంలోకి వచ్చారంటే.. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయనే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగసామి. ఇప్పటికే 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రంగసామి.. త్వరలో జరగనున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి.. ఐదోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరపున 1990 పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో తట్టంచావడి నియోజకవర్గం నుంచి పోటీచేసిన రంగసామి.. 989 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అదే తట్టంచావడి నుంచి 1991, 1996, 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1991లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2001, 2006లో పుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అయితే 2008లో కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత వివాదం కారణంగా 2008లో ముఖ్యమంత్రి పదవికి రంగసామి రాజీనామా చేశారు. ఈ కోరనే 2011 ఫిబ్రవరిలో ఆలిండియా ఎన్నార్‌ కాంగ్రెస్‌ పార్టీని రంగసామి పెట్టారు. అదే ఏడాది జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన రంగసామి.. ఘన విజయం సాధించి.. మూడోసారి సీఎం పదవిని దక్కించుకున్నారు. అయితే ఆలిండియా ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన 48 రోజులకే రంగసామి అధికారంలోకి రావడం.

2011లో జరిగిన ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీచేసిన రంగసామి.. రెండుచోట్ల జయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత జరిగిన 2016 ఎన్నికల్లోనూ గెలిచిన రంగసామి.. 2011 నుంచి 2016 వరకు పుదుచ్చేరి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత 2016 నుంచి 2021 మధ్య పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యానాం, తట్టంచావడిలో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసిన రంగసామి.. తట్టంచావడిలో గెలిచి.. యానాంలో ఓటమి పాలయ్యారు.
2021 పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎన్డీఏలో భాగంగా పోటీ చేసిన ఆలిండియా ఎన్నార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఘన విజయం సాధించింది. దీంతో పుదుచ్చేరికి నాలుగోసారి సీఎంగా ఎన్నికైన రంగసామి.. సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉన్న పుదుచ్చేరిలో 1936 నుంచి ఇప్పటివరకు 20 మంది సీఎంలుగా పనిచేశారు. అందులో అత్యధికంగా రంగసామి 4 సార్లు సీఎంగా పనిచేసి రికార్డుల్లోకి ఎక్కారు.
ఇక త్వరలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమితో కలిసి పోటీచేసేందుకు రెడీ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే రంగసామి ఐదోసారి ముఖ్యమంత్రి కానున్నారు. 30 నియోజకవర్గాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఎన్నార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 16 సీట్లను ఎన్డీఏ కూటమి కేటాయించింది. ఏప్రిల్‌ 9న పుదుచ్చేరి ఎన్నికలు జరగనుండగా.. తట్టంచావడి, మంగళం నియోజకవర్గాల నుంచి రంగసామి పోటీ చేస్తున్నారు.

ఇక తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రంగసామికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. విద్యార్థులకు ఉదయం పూట రొట్టె, పాలు అందించే పథకంతోపాటు.. వృద్ధులకు పింఛన్ల పెంపు.. సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలు.. విపత్తుల సమయంలో రైతులకు పుదుచ్చేరి రంగసామి బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు.

1950 ఆగస్ట్ 4వ తేదీన పుదుచ్చేరిలోని తిలాస్‌పేటైలో పుట్టిన రంగసామి.. వాణిజ్యం, న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. కామరాజర్‌ అనుచరుడైన రంగసామి.. నటుడు శివాజీ గణేశన్‌కి వీరాభిమాని. పుదుచ్చేరి మాజీ మంత్రి పెట్టా పెరుమాళ్‌కు సహాయకుడిగా రంగసామి.. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రోడ్డు పక్కన ఉన్న ప్రజలను పలకరిస్తూ వారితో కలిసిపోయే రంగసామి.. కాస్త టైం దొరికితే టెన్నిస్ ఆడుతారు.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి



Source link

Spread the love