Revanth reddy: తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ, అమిత్‌ షా సహా ఎవరినైనా కలుస్తా: రేవంత్‌రెడ్డి


నిర్మల్‌: పాలమూరు జిల్లాతో సమానాంగా ఆదిలాబాద్‌ జిల్లాకు నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy)హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

‘‘నిర్మల్‌ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే సీఎం అయ్యాను. ఆదిలాబాద్‌ జిల్లా పోరాటానికి, పౌరుషానికి గడ్డ. జల్‌, జంగల్‌, జీమీన్‌ అంటూ కుమురం భీం కొట్లాడారు. ఈ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. బాసర ట్రిపుల్‌ ఐటీలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా ఇందుకు సహకరించాలి. పారిశ్రామికంగానూ ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. జిల్లాకు ఎయిర్‌ బస్‌ తీసుకొస్తాం. ఎయిర్‌పోర్టు కోసం 10వేల ఎకరాల భూమిని సేకరించాలి. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిద్దాం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాల్సిందే.. ఆదిలాబాద్‌ జిల్లాకు నీరు ఇవ్వాల్సిందే.

ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధాని వద్దకు వెళ్తున్నాం. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి.. అడగాల్సిన ప్రాజెక్టులు అడుగుతున్నాం. మోదీని పదే పదే కలుస్తున్నానని కొంత మంది విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు ఎవరు ఇస్తారు.. ప్రధాని కాదా? ప్రధానిని కలవకపోతే నిధులు, ప్రాజెక్టులు ఎలా వస్తాయి. పదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం అడగలేదు. అడగకపోతే రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రానికి ఎలా తెలుస్తుంది. పైరవీలు చేయను.. పర్సనల్‌ ఎంజెడా లేదు.. రాష్ట్ర అభివృధ్ధి కోసం, నిధుల కోసం.. ప్రధాని మోదీ, అమిత్‌ షా సహా ఎవరినైనా కలుస్తా. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే అందరి లక్ష్యం. పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఈ ఆలోచన చేయకపోవడం వల్లే.. తెలంగాణకు తీరని నష్టం జరిగింది. రాష్ట్ర భాజపా నేతలు కూడా ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు తేవాలి.

నిర్మల్‌ జిల్లాకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ మంజూరు చేస్తున్నాం. నాగోబా జాతరకు రూ.22కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.300 కోట్లు కేటాయించి పునర్నిర్మాణం చేశాం. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ స్వర్గధామంగా మారింది. పెట్టుబడుల కోసం మేం ప్రయత్నిస్తుంటే.. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేళ్లు అధికారాన్ని అనుభవించి రూ.8లక్షల కోట్లు అప్పు చేశారు.. రూ. వేల కోట్లు దోపిడీ చేశారు’’ అని సీఎం అన్నారు.



Source link

Spread the love