Telangana Land Registrations,ధరణి, భూ భారతి పోర్టల్ లోపాలతో భారీ స్కాం.. రూ. 42 కోట్లు సైలెంట్గా కొట్టేశారు..! – land registration scam 42 crore stamp duty diverted due to bhu bharati dharani portal glitches
Telangana Land Registrations,ధరణి, భూ భారతి పోర్టల్ లోపాలతో భారీ స్కాం.. రూ. 42 కోట్లు సైలెంట్గా కొట్టేశారు..! – land registration scam 42 crore stamp duty diverted due to bhu bharati dharani portal glitches
తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధరణి, భూ భారతి పోర్టల్ లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని మీసేవ నిర్వాహకులు, మధ్యవర్తులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రూ. 42 కోట్ల స్టాంప్ డ్యూటీ సొమ్మును అక్రమంగా మళ్లించారు. సీసీఎల్ఏ ఆడిట్ చేయగా.. 4,300 లావాదేవీల్లో నగదు వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.
హైలైట్:
ధరణి, భూ భారతి పోర్టల్ లోపాలతో భారీ స్కాం
రూ. 42 కోట్ల స్టాంప్ డ్యూటీ కొట్టేశారు
సీసీఎల్ఏ ఆడిట్లో వెలుగులోకి వాస్తవాలు
(ఫోటోలు– Samayam Telugu)
తెలంగాణ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన స్టాంప్ డ్యూటీ సొమ్మును అక్రమార్కులు పక్కదారి పట్టించారు. ధరణి నుంచి నేటి భూ భారతి వరకు పోర్టల్లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని గత ఆరేళ్లుగా ఈ అక్రమ దందా కొనసాగడం విస్తుగొలుపుతోంది. 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తహసీల్దార్లకు అప్పగించిన నాటి నుంచి ఈ లొసుగులు మొదలయ్యాయి. గత ఆరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 52 లక్షల లావాదేవీలను సీసీఎల్ఏ ఆడిట్ చేయగా.. అందులో 4,300 లావాదేవీల్లో నగదు వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. సుమారు రూ. 42 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి ఆ సొమ్మును మీసేవ కేంద్రాల నిర్వాహకులు, కొందరు మధ్యవర్తులు తమ ఖాతాలకు మళ్లించుకున్నట్లు అధికారులు గుర్తించారు.రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి చలానాను మూడు దశల్లో తనిఖీ చేసే పటిష్టమైన వ్యవస్థ ఉంది. కానీ రెవెన్యూ శాఖ పరిధిలోని అప్పటి ధరణి, ప్రస్తుత భూ భారతి పోర్టల్లో అటువంటి క్రాస్-చెక్ వ్యవస్థ లేదు. మీసేవ నిర్వాహకులు ఇచ్చే ఇన్పుట్స్ను లేదా వారు జనరేట్ చేసే చలానా మొత్తాన్ని సరిచూసే సాంకేతిక పరిజ్ఞానాన్ని పోర్టల్కు అనుసంధానం చేయలేదు. రిజిస్ట్రేషన్ శాఖలో మార్కెట్ విలువ ప్రకారం స్టాంప్ డ్యూటీ లెక్కిస్తారు. కానీ రెవెన్యూలో మాత్రం తక్కువ విలువనే పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు ఉండటం అక్రమార్కులకు వరంగా మారింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఆడిట్ జరగకపోవడం వల్ల ఈ అక్రమాలు నిర్విఘ్నంగా సాగాయి. ఎమ్మార్వో కార్యాలయాల్లో రోజువారీ రిజిస్ట్రేషన్లు, జమైన చలానా సొమ్మును సరిచూసే వ్యవస్థ లేకపోవడం మరో ప్రధాన లోపం.
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,300 అవకతవకల లావాదేవీల్లో ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే 2,100 లావాదేవీలు జరిగాయని సీసీఎల్ఏ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,300, జనగామ, ఇతర జిల్లాల్లో మిగిలిన 900 లావాదేవీల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ స్కామ్ తీవ్రతను గుర్తించిన సీసీఎల్ఏ.. పక్కదారి పట్టిన రూ. 42 కోట్లను వెంటనే రికవరీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు భూ భారతి పోర్టల్ను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ న్యూస్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం సందీప్కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ల కోసం పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. సందీప్ ఈజేఎస్ నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, మార్చిలో సందీప్ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి