తెలంగాణలో ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాన అడ్డంకిగా మారిన అఫిడవిట్ నిబంధనను ప్రభుత్వం తొలగించనుంది. దశాబ్దాల క్రితం భూమి అమ్మిన వారు ఇప్పుడు సంతకాలు చేసేందుకు నిరాకరిస్తుండటంతో 9 లక్షల దరఖాస్తులు నిలిచిపోయాయి. దీనిని గమనించిన సర్కార్.. ఇకపై క్షేత్రస్థాయిలో పొషెషన్ (భూమి ఎవరి ఆధీనంలో ఉంది), ఇరుగుపొరుగు రైతుల సాక్ష్యాల (పంచనామా) ఆధారంగానే క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలతో ఒకటి రెండు రోజుల్లో కొత్త జీవో విడుదలయ్యే అవకాశం ఉంది.

గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం.. తెల్లకాగితంపై భూమిని అమ్మిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పాలి లేదా నోటరీ చేసిన పత్రాన్ని ఇవ్వాలి. అయితే.. రెండు మూడు దశాబ్దాల క్రితం వేల రూపాయల్లో ఉన్న భూమి ధర ఇప్పుడు కోట్లకు చేరడంతో.. పాత యజమానులు సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారు. ‘మాకేం ఇస్తారు?’ అంటూ బేరసారాలకు దిగడం వల్ల కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఆరు నెలల్లో లక్ష దరఖాస్తులు కూడా పరిష్కారం కాకపోవడానికి ఇదే ప్రధాన కారణమని రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది.
కొత్తగా రాబోయే మార్గదర్శకాల ప్రకారం.. కేవలం కాగితాల మీద సంతకాల కంటే ‘పొషెషన్’ అంటే ఆ భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది అనే అంశానికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తహశీల్దార్ లేదా రెవెన్యూ సిబ్బంది నేరుగా పొలాల్లోకి వెళ్లి విచారణ జరుపుతారు. సదరు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఎన్ని ఏళ్లుగా సాగు చేస్తున్నాడు? చుట్టుపక్కల రైతులు ఏం చెబుతున్నారు? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని పంచనామా నిర్వహిస్తారు. ఇరుగుపొరుగు రైతుల వాంగ్మూలం ఆధారంగా అది నిజమైన క్రయవిక్రయమేనని తేలితే.. అమ్మిన వ్యక్తితో సంబంధం లేకుండానే క్రమబద్ధీకరణ పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
భూభారతి చట్టం స్ఫూర్తితో..
భూభారతి చట్టం ఉద్దేశం.. భూ వివాదాలను తగ్గించి సామాన్యులకు హక్కులు కల్పించడం. కానీ.. కొందరు అధికారుల అత్యుత్సాహం వల్ల నిబంధనలు క్లిష్టంగా మారాయని ప్రభుత్వం భావించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ నిపుణులు, రైతు ప్రతినిధులతో చర్చించారు. ‘ఇన్నేళ్ల తర్వాత పాత యజమాని వచ్చి అఫిడవిట్ ఇవ్వడం సాధ్యం కాదని’ ముఖ్యమంత్రి అభిప్రాయపడటంతో నిబంధనల సడలింపునకు మార్గం సుగమమైంది. న్యాయశాఖ నుండి కూడా క్లియరెన్స్ రావడంతో.. పెండింగ్లో ఉన్న 9 లక్షల కుటుంబాలకు త్వరలోనే మేలు జరగనుంది.
